న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణించిన జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. టోర్నీలో టేబుల్ టాపర్గా నిలిచిన ఈ జట్టు క్వాలిఫైయర్స్లో దెబ్బతింది. చెన్నై, కోల్కతా జట్ల చేతిలో వరుస ఓటములతో ఫైనల్ చేరకుండానే ఇంటి దారి పట్టింది. ఈ క్రమంలో ఢిల్లీ సారధి రిషభ్ పంత్ చేసిన కొన్ని వ్యూహాత్మక పొరపాట్లు కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. దీంతో అతన్ని వచ్చే సీజన్లో సారధిగా కొనసాగించాలా? వద్దా? అనే చర్చ మొదలైంది.
దీనిపై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. ఢిల్లీ జట్టు సారధిగా రిషభ్ పంత్ను వచ్చే ఏడాది రిటైన్ చేసుకోవాలని నెహ్రా సూచించాడు. అతను ఎంత ఆడితే అంత ఎదుగుతాడని, ఆ విషయంలో ఎటువంటి అనుమానమూ అక్కర్లేదని ఈ మాజీ పేసర్ అభిప్రాయపడ్డాడు. అతను ఎంత త్వరగా నేర్చుకుంటే అతనికి, ఫ్రాంచైజీకి అంత మంచిదని చెప్పాడు. కొన్ని వ్యూహాత్మక తప్పిదాలను పక్కనపెడితే పంత్ మంచి సారధి అని మెచ్చుకున్నాడు.
‘‘అందరూ ఎంఎస్ ధోనీలు అవ్వలేరు. అతనంటే 2007లో కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే నేరుగా ప్రపంచకప్ గెలిచాడు. అందరూ అలా చేయలేరు. పంత్కు ఎదగడానికి కొంచెం సమయం ఇవ్వండి’’ అని నెహ్రా అన్నాడు. సెహ్వాగ్ కూడా ఢిల్లీ జట్టు పంత్ను రిటైన్ చేసుకోవాలని అభిప్రాయపడ్డాడు. అయితే అతనికి జట్టు పగ్గాలు అందించాలా? వద్దా? అనే నిర్ణయం జట్టు కూర్పు పూర్తయిన తర్వాత తీసుకోవాలని చెప్పాడు. అతని కన్నా బెటర్ ఆప్షన్ ఉంటే మంచిదేనని, లేదంటే పంత్ ఉంటాడని అన్నాడు.