లండన్: జాతి వివక్ష ట్వీట్ల అంశం ఇంగ్లండ్ క్రికెట్లో దుమారం రేపుతున్నది. గతంలో వివక్షాపూరితమైన, భారతీయులను హేళన చేసేలా ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, వైస్ కెప్టెన్ జోస్ బట్లర్ ట్వీట్లు చేశారని ఆరోపిస్తూ కొన్ని స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లపై ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు విచారణ ప్రారంభించింది. ఎనిమిదేండ్ల క్రితం జాతివివక్ష ట్వీట్లు చేశాడని టెస్టు అరంగేట్రం చేసిన వారానికే యువ ప్లేయర్ ఓలీ రాబిన్సన్కు ఈసీబీ ఇటీవల సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ప్రపంచకప్ గెలిచిన సారథి మోర్గాన్, స్టార్ బ్యాట్స్మన్ బట్లర్పైనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై పారదర్శకంగా విచారణ చేస్తామని ఈసీబీ ప్రకటించింది. అయితే మోర్గాన్, బట్లర్ ట్వీట్లలోని కొన్ని లైన్లే వైరల్ అవుతుండడంతో అసలు వారు ఏ సందర్భంలో ఆ రాతలు రాశారో ఈసీబీ విచారించనుంది.