అద్వితీయ ప్రదర్శనతో సిరీస్లో పైచేయి సాధించిన టీమ్ఇండియా.. చివరి టెస్టులోనూ నెగ్గి ట్రోఫీ చేజిక్కించుకోవాలని చూస్తుంటే.. ఆఖరి పోరులోనైనా నెగ్గి సిరీస్ సమం చేయాలని ఇంగ్లండ్ భావిస్తున్నది. పేస్ పిచ్లపై మన బౌలింగ్ దళం ఇరగదీస్తుంటే.. బ్యాటింగ్లో సమిష్టి కృషికి ఫలితాలు దక్కుతున్నాయి. ఈ జోరు ఇలాగే కొనసాగిస్తే.. మాంచెస్టర్లో విజయం పెద్ద కష్టం కాకున్నా.. కరోనా మహమ్మారి టీమ్ఇండియాను కలవరపెడుతున్నది. ఇప్పటికే హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ వైరస్ బారిన పడగా.. తాజాగా సహాయక సిబ్బందిలో మరొకరికి కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది.
మాంచెస్టర్: ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని విజయాల బాట పట్టడాన్ని అలవాటుగా మార్చుకున్న టీమ్ఇండియా.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫ్రోర్డ్ మైదానంలో నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన.. ఆఖరి పోరులోనూ నెగ్గి పొట్టి ప్రపంచకప్నకు ముందు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలనుకుంటుంటే.. సొంతగడ్డపై సిరీస్ కోల్పోకూడదని ఇంగ్లండ్ యోచిస్తున్నది. ఐదు దశాబ్దాల తర్వాత ఓవల్లో టెస్టు గెలిచిన ఆనందం టీమ్ఇండియాదైతే.. పేసర్ల కోసం తయారుచేసిన పిచ్లపై తమ బౌలర్ల కన్నా భారత బౌలింగ్ దళం ఎక్కువ వికెట్లు తీస్తున్న నిర్వేదం ఇంగ్లిష్ జట్టుది. ఈ టెస్టును ‘డ్రా’ చేసుకున్న భారత్కు ట్రోఫీ దక్కనుండగా.. ఆస్ట్రేలియా (2018-19), ఇంగ్లండ్లో టెస్టు సిరీస్లు నెగ్గిన భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కనున్నాడు.
ఈ నేపథ్యంలో మరో కీలక సమరం ఖాయం కాగా.. ఫుల్ ఫామ్లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ, పేస్స్టర్ జస్ప్రీత్ బుమ్రాలకు ఈ మ్యాచ్లో విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫామ్ లేమితో సతమతమవుతున్న టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానేకు మరో చాన్స్ దక్కుతుందా.. లేక అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్, హనుమ విహారిలో ఒకరిని తీసుకుంటారా చూడాలి. మూడో టెస్టు అనంతరం గాయపడ్డ మహమ్మద్ షమీ పూర్తిగా కోలుకోగా.. బుమ్రాకు విశ్రాంతినిచ్చి షమీని తుది జట్టులోకి తీసుకునే చాన్స్లు ఎక్కువగా ఉన్నాయి. కొవిడ్-19 బారిన పడిన శిక్షణ బృందం అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్ కోహ్లీపై అదనపు భారం పడటం ఖాయం కాగా.. పిచ్ స్పిన్కు అనుకూలించనుండటంతో ఈ సిరీస్లో తొలిసారి అశ్విన్ మైదానంలో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
మరో పాజిటివ్
టీమ్ఇండియా సహయా బృందంలో మరొకరికి కరోనా సోకింది. ఇప్పటికే హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ వైరస్ బారిన పడగా.. తాజాగా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మర్కు కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో గురువారం భారత ప్రాక్టీస్ సెషన్ రద్దయింది. ఆటగాళ్లందరికీ నెగిటివ్ రావడం ఊరటనిచ్చే అంశమే అయినా.. ‘ప్రస్తుతానికి మ్యాచ్ జరుగుతుందో లేదో తెలియదు. ఆట సాగాలనే ఆశిద్దాం’అన్న గంగూలీ మాటలు ఆందోళన కలిగించినా.. మ్యాచ్కు ఎలాంటి ఆటంకం లేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
పిచ్, వాతావరణం
పొడిగా ఉన్న పిచ్ బౌన్స్కు సహకరించనుండగా.. మ్యాచ్ సాగుతున్నా కొద్ది బంతి స్పిన్ అయ్యే అవకాశముంది. మ్యాచ్కు వర్ష సూచన లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్/మయాంక్, రాహుల్, పుజారా, రహానే/విహారి, పంత్, జడేజా/అక్షర్, శార్దూల్, అశ్విన్, షమీ/సిరాజ్, ఉమేశ్
ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), బర్న్స్, హమీద్, మలన్, పోప్, బట్లర్, అలీ, వోక్స్, రాబిన్సన్, వుడ్, అండర్సన్.