నాటింగ్హామ్: వర్షం కారణంగా ఆగి ఆగి సాగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా ఫర్వాలేదనిపించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (214 బంతుల్లో 84; 12 ఫోర్లు), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (56; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 278 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (25) క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా.. ఆఖర్లో జస్ప్రీత్ బుమ్రా (28) విలువైన పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్ 5, అండర్సన్ 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ వర్షం కారణంగా శుక్రవారం ఆట నిలిచిపోయే సమయానికి వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆతిథ్య జట్టు.. కోహ్లీ సేన స్కోరుకు ఇంకా 70 పరుగులు వెనుకబడి ఉంది. రోరి బర్న్స్ (11), సిబ్లే (9) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 125/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా.. మరో 153 పరుగులు చేసి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడేందుకు యత్నించిన పంత్ త్వరగానే ఔటైనా.. రాహుల్కు జడేజా చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. సెంచరీ చేసేలా కనిపించిన రాహుల్.. అండర్సన్ వేసిన ఇన్స్వింగర్కు వికెట్ సమర్పించుకోగా.. ఆఖర్లో బుమ్రా, షమీ విలువైన పరుగులతో ఆధిక్యాన్ని పెంచారు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 183, భారత్ తొలి ఇన్నింగ్స్: 278 (రాహుల్ 84, జడేజా 56; రాబిన్సన్ 5/85, అండర్సన్ 4/54), ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 25/0