లండన్: టాపార్డర్ మెరుపులకు లోయర్ ఆర్డర్ సహకారం తోడవడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 270/3తో ఆదివారం నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత్.. 466 పరుగులకు ఆలౌటైంది. కోహ్లీ (44), జడేజా (17), రహానే (0) ఎక్కువసేపు నిలువలేకపోయారు. ఫలితంగా ఒక దశలో 312/6తో కష్టాల్లో పడ్డ టీమ్ఇండియా.. శార్దూల్ ఠాకూర్ (60; 7 ఫోర్లు, ఒక సిక్సర్), రిషబ్ పంత్ (50) ఫిఫ్టీలతో తిరిగి కోలుకుంది. ఇంగ్లిష్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న ఈ జోడీ ఏడో వికెట్కు వంద పరుగుల జోడించి భారత్కు మంచి ఆధిక్యాన్ని అందించింది.
ఆఖర్లో ఉమేశ్ యాదవ్ (25; ఒక ఫోర్, 2 సిక్సర్లు), జస్ప్రీత్ బుమ్రా (24; 4 ఫోర్లు) ధాటిగా ఆడి విలువైన పరుగులు జోడించారు. సమిష్టి కృషితో టీమ్ఇండియా.. ఇంగ్లండ్కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, రాబిన్సన్, మోయిన్ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న ఇంగ్లిష్ జట్టు విజయానికి 291 పరుగులు చేయాల్సి ఉంది. బర్న్స్ (31), హమీద్ (43) క్రీజులో ఉన్నారు. సోమవారం చివరి రోజు భారత బౌలర్ల ప్రదర్శనపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 191, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290, భారత్ రెండో ఇన్నింగ్స్: 466 (రోహిత్ 127, శార్దూల్ 60, పంత్ 50; వోక్స్ 3/83), ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 77/0 (బర్న్స్ 31 నాటౌట్, హమీద్ 43 నాటౌట్).