కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 18 లేదా 19న యూఏఈ వేదికగా సీజన్ రెండో దశను ప్రారంభించాలని భావిస్తోంది. రీషెడ్యూల్ చేసిన ఐపీఎల్ 14వ సీజన్ రెండోదశలో ఆడటానికి ఇంగ్లాండ్ ఆటగాళ్లను విడుదల చేయబోమని ఇంగ్లాండ్ మెన్స్ క్రికెట్ టీమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గిల్స్ స్పష్టం చేశాడు.
ఐపీఎల్కు అవసరమైన పెద్ద విండో కోసం భారత్తో త్వరలో జరిగే టెస్టు సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేసే ఉద్దేశం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు లేదని గిల్స్ పేర్కొన్నాడు. టీ20 వరల్డ్కప్ వరకు ఇంగ్లాండ్ టీమ్కు బిజీ షెడ్యూల్ ఉందని వెల్లడించాడు. ఆతిథ్య ఇంగ్లాండ్, భారత్ మధ్య టెస్టు సిరీస్ సెప్టెంబర్ 14న ముగియనుంది. ఐపీఎల్ను సెప్టెంబర్ 18న ప్రారంభించి..అక్టోబర్ 12వరకు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇదే సమయంలో ఇంగ్లాండ్ జట్టు.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల్లో పర్యటించనుంది.