మరియమ్మ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచారు
తప్పుచేస్తే అధికారులకైనా.. శిక్ష తప్పదు
ఖమ్మం జిల్లా ప్రభుత్వ దవాఖాన అద్భుతంగా ఉంది
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ చంద్రయ్య
ఖమ్మం సిటీ, జూన్ 30: ఇటీవల పోలీసు కస్టడీలో మరణించిన దళిత మహిళ మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య కొనియాడారు. బుధవారం మృతురాలి కుమారుడు ఉదయ్కిరణ్ను పరామర్శించేందుకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బృందం ఖమ్మానికి వచ్చింది. నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడి దగ్గరకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి గురించి స్థానిక వైద్యులతో చర్చించారు. ఉదయ్కిరణ్ కోరిక మేరకు అందరినీ బయటకు పంపించి కొద్దిసేపు ఏకాంతంగా చర్చించారు. అనంతరం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను సందర్శించారు. ఐసీయూ, మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. మృతురాలు మరియమ్మ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవడంలో సీఎం కేసీఆర్ స్పందించిన తీరు ఆదర్శనీయమని అన్నారు. తాము మరియమ్మ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకే వచ్చామన్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజలు రాజ్యాంగానికి లోబడే నడుచుకోవాలని జస్టిస్ చంద్రయ్య వ్యాఖ్యానించారు. ప్రధానంగా పోలీసు స్టేషన్కు వెళ్లిన వారిని తిట్టే హక్కు, కొట్టే హక్కు పోలీసులకు లేదని స్పష్టం చేశారు. తప్పు చేస్తే అధికారులు సైతం సామాన్యుల మాదిరిగానే శిక్ష అనుభవించక తప్పదని అన్నారు.
అధికారులకైనా శిక్ష తప్పదు..
అధికార దుర్వినియోగానికి పాల్పడితే అధికారులపైనా చర్యలు తప్పవని జస్టిస్ చంద్రయ్య హెచ్చరించారు. తమకు వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రజల హక్కులకు భంగం కలిగించే వార్తల ఆధారంగా కేసులను సుమోటోగా స్వీకరిస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి కూడా తమకు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ చర్యలు భేష్..
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి ఫలితంగానే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పడిందన్నారు. మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచిందని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బాధిత కుటుంబానికి పరిహారం, ఇల్లు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించడం ఇవ్వడం అద్భుతమని వ్యాఖ్యానించారు.
ఖమ్మం సర్కారు దవాఖాన సూపర్..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బృందం ప్రశంసల వర్షం కురిపించింది. చైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. దవాఖాన క్లీన్ అండ్ గ్రీన్గా ఉందని ప్రశంసించారు. రోగులతో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తూ వైద్యుల పనితీరుతోపాటు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కమిషన్ సభ్యులు ఆనందరావు, మహ్మద్ ఇర్ఫాన్ అహ్మద్, కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్ఎంవో డాక్టర్ బీ.శ్రీనివాసరావు, సూపరింటెండ్ డాక్టర్ బీ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.