నిజాంసాగర్ ప్రాజెక్టులో కాళేశ్వర’ జల సవ్వడి
కాలంతో పని లేకుండానే ఆయకట్టుకు ప్రాణం
ప్రాజెక్టుకు పూర్వవైభవం
నిజామాబాద్, ఏప్రిల్ 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంజీరపై ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులతో ఉమ్మడి జిల్లా వరప్రదాయినీ.. వందేండ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వానకాలంలో రాష్ట్రమంతా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నా ప్రాజెక్టులోకి వరద లేకపోవడంతో కొన్నేండ్లుగా కళావిహీనంగానే కనిపిస్తున్నది. దీనికి తోడు సింగూర్ ప్రాజెక్టు నిర్మాణంతో నిజాంసాగర్ నిండడం కష్టమైంది. భారీ వర్షాలు కురిసి సింగూర్ నిండితేనే నిజాంసాగర్ జలకళను సంతరించుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో సింగూర్ దిగువ నుంచి నిజాంసాగర్ వరకు మంజీరా నది రూపుకోల్పోయింది. ఈ పరిస్థితికి సీఎం కేసీఆర్ చరమగీతం పాడారు. తన కలల ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగంగా కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు మీదుగా జలాలను మంజీరకు తరలించడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్వవైభవం సంతరించుకుంటున్నది. భవిష్యత్తులో సింగూర్పై ఆధారపడకుండానే ఏడాదంతా జలకళతో అలరారనున్నది. దీంతో కాలంతో పని లేకుండా ఆయకట్టు రైతులకు సాగునీరు అందనున్నది. శతవసంతాలకు చేరువైన భారీ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ముందస్తుగానే శతాబ్ది కానుకను అందించినట్లు అయ్యింది.
దేశంలోనే పేరొందిన భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో నిజాంసాగర్ ఒకటి. దాదాపు శతాబ్ద కాలపు చరిత్ర గల ప్రాజెక్టుకు గడిచిన రెండున్నర దశాబ్దాలుగా జలకళ సంతరించుకోవడం గాలిలో దీపంలా మారింది. ఎగువ కర్నాటక, మహారాష్ట్రల్లో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులతో తెలంగాణ ప్రాంతంలో మంజీర నది బోసిపోతున్నది. వానకాలంలో తెలంగాణ ప్రాంతమంతా వరద నీటితో ఉప్పొంగుతున్నప్పటికీ నిజాంసాగర్ మాత్రం వట్టిపోవడం గడిచిన కొన్నేండ్లుగా చూస్తున్నదే. అతి భారీ వర్షాలు కురిస్తే తప్ప మంజీరపై ఎగువన నిర్మించిన ప్రాజెక్టుకులు ఉప్పొంగే పరిస్థితి లేదు. అతివృష్టి సంభవిస్తేనే నిజాంసాగర్ ప్రాజెక్టుకు భవిష్యత్తు.. లేదంటే అధోగతి. ఈ చారిత్రక ప్రాజెక్టుకు జల సవ్వళ్లు సిద్ధించాలంటే మంజీర నది ఉరకలు వేయాలి. లేదంటే భారీ ప్రాజెక్టుకు కామారెడ్డి జిల్లాలోని చిన్నపాటి వాగు లు, వంకల గుండా వచ్చే చిన్నపాటి ప్రవాహమే దిక్కు. ఈ దయనీయ దుస్థితికి చరమగీతం పాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంసాగర్ ప్రాజెక్టు చరిత్రను తిరగరాశారు. మంజీర నదిలో సంతరించుకునే వరద ప్రవాహంతో సంబంధం లేకుండానే కాళేశ్వరం జలాలతో పునరుజ్జీవం పోసేందుకు వేసిన ముందడుగు విజయవంతమైంది. తద్వారా చారిత్రక ప్రాజెక్టుకు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నది.
గతమంతా ఘన చరిత్ర…
భారతదేశంలోనే తొలి నీటిపారుదల ప్రాజెక్టు. దాదాపు 30 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కట్టడం. భారీ నిర్మాణ నైపుణ్యం దాగి ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు అద్భుత ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీక. అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నేతృత్వంలో 1923లో అచ్చంపేట గ్రామంలో భారీ నీటి పారుదల ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ పర్యవేక్షణలో 1931లో నిర్మాణం పూర్తయ్యింది. 3 కిలో మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో ఆనకట్టను చూడచక్కగా నిర్మించారు. ఈ ప్రాజెక్టు కోసం బంజపల్లి వద్ద పరిసరాల్లోని 40 గ్రామాలను ఖాళీ చేయించారు. మంజీరా నది వద్ద మంజీర మిగులు జలాలను ఆధారంగా చేసుకుని ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. నాడు 2.75లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడమే లక్ష్యంగా నిర్మించారు. ప్రధాన కాలువ పొడవు 155 కిలో మీటర్లు. డిస్ట్రిబ్యూటరీ కాలువల సంఖ్య 82. ఉప కాలువల సంఖ్య 283. డిస్ట్రిబ్యూటరీ, ఉప కాలువల మొత్తం పొడవు సరాసరి 1771 కిలో మీటర్లు. 1405 అడుగుల లోతు ఉన్న ప్రాజెక్టు కాలక్రమేణా పూడిక వల్ల నీటి నిల్వ 1376 అడుగులకు తగ్గిపోయింది. ప్రస్తుతం 2.31 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించగలుగుతున్నది. కేవలం 17.80 టీఎంసీలకు పరిమితమైంది. నిజాంపాలనలో నిర్మించినందున ఈ ప్రాజెక్టుకు నిజాంసాగర్గా ప్రసిద్ధికెక్కింది.
ప్రశ్నార్ధకం నుంచి పునరుజ్జీవం వైపు…
మంజీరా నదిపై కాలక్రమేణా ఎగువ ప్రాంతంలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా అనేక ఆనకట్టలు నిర్మించాయి. సమైక్యపాలకులు వీటిని అడ్డుకునే చర్యలేవీ చేయకపోవడంతో ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న నిజాంసాగర్ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. అంతేగాక 1979లో నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఇదే మంజీరా నదిపై సంగారెడ్డి పట్టణానికి 30 కిలో మీటర్ల ఎగువన సింగూర్ గ్రామంలో ప్రాజెక్టును నిర్మించారు. 29.19 టీఎంసీల సామర్థ్యంతో హైడల్ విద్యుత్ ఉత్పత్తి, సాగు, హైదరాబాద్ జంట నగరాలకు తాగు నీటి వసతి కోసం సింగూర్ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. 1998లో ఈ ప్రాజెక్టు ప్రారంభంతోనే నిజాంసాగర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరద నీరంతా సింగూర్ వరకు వచ్చి నిలిచిపోవడం, దిగువకు పారకం లేకపోవడంతో నిజాంసాగర్ నిండడం కష్టసాధ్యమైంది. ఇలా రెండున్నర దశాబ్దాలుగా నిజాంసాగర్ ఆయకట్టు పరిస్థితి గందరగోళంలో పడగా ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆలోచనతో భరోసా కలుగుతోంది. సింగూర్ దిగువ నుంచి నిజాంసాగర్ వరకు మంజీరా నది రూపుకోల్పోగా ఇప్పుడీ ఎడారి పరిస్థితిని సీఎంకేసీఆర్ పూర్తిగా మార్చివేశారు. తన కలల ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగంగా కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు మీదుగా జలాలను మంజీరకు తరలించడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవానికి నోచుకుంటున్నది. శతవసంతాలకు చేరువైన భారీ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ముందస్తుగానే శతాబ్ది కానుకను అందించినట్లు అయ్యింది.
ఆయకట్టుకు పాత రోజులు…
నిజాంసాగర్ ప్రాజెక్టు నిండితేనే ఆయకట్టు రైతులకు గుండె ధైర్యం. పంటల సాగుకు ఢోకా ఉండదనే నమ్మకం. కాలంతో నిమిత్తం లేకుండానే సాగులో దిగొచ్చనే ధైర్యం ఈ ప్రాంత వాసులకు అనుభవసారం. పాత ఆయకట్టు పరిధిలోని రైతన్నలు బోరు బావులపై ఆధారపడకుండా కాలువల ఆధారంగానే ఎక్కువ శాతం మంది పంటలు సాగు చేసేవారు. కాలక్రమేణా నిజాంసాగర్కు గడ్డు పరిస్థితులు రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. ఒకప్పుడు 2.70 లక్షలు ఎకరాల ఆయకట్టు ఉండగా ప్రస్తుతం 2.35 లక్షలకు పడిపోయింది. ఇందులో 80వేల ఎకరాలకు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నుంచి అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలతో నీళ్లను ఎత్తిపోసి సాగు నీరు అందిస్తున్నారు. ఫలితంగా నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం పక్కాగా 1.60 లక్షల ఎకరాలకే నీళ్లు అందే అవకాశాలు ఉన్నాయి. నిజాంసాగర్కు కాళేశ్వర ప్రాజెక్టు దన్నుగా నిలవడం ద్వారా ఆయకట్టు పరిధి మరింతగా విస్తరించే అవకాశం లేకపోలేదు.