హైదరాబాద్ : జాతీయ హ్యాండ్ బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావు భారత్ నుంచి విశిష్ట అతిథిగా టోక్యో ఒలింపిక్స్కు హాజరు కానున్నారు. టోక్యో వెళ్లే భారత డెలిగేట్స్ బృందంలో జగన్ మోహన్ రావు పేరును భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చేర్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు టోక్యో ఒలింపిక్స్కు వెళ్తున్న ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రావునే కావడం విశేషం.
జగన్కు ఈ అవకాశం రావడం పట్ల తెలుగు రాష్ట్రాల క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్ మోహన్ రావుకు ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా నుంచి మంగళవారం ఓ లేఖ కూడా వచ్చింది. వచ్చే నెల 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్న ఒలంపిక్స్ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం రావడం పట్ల జగన్ మోహన్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఒలంపిక్స్ నిర్వహణ, అక్కడి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు మౌలిక సదుపాయాలను పరిశీలించి జపాన్ నుంచి వచ్చాక కేంద్ర రాష్ట్ర క్రీడా శాఖలు, ఐఓఏకు ఒక నివేదిక అందజేస్తానని జగన్మోహన్ రావు తెలిపారు.