అసలెట్ల ముసలెడ్లు రంకెలేత్తయి
ఇది రైతు జీవితానుభవంలోంచి వచ్చిన సామెత. ఆశ్లేష కార్తెని తెలంగాణలో అసలేరంటారు. ఈ సమయంలో ముసలిఎడ్లుకూడా రంకెలేస్తూ ఉత్సాహంగా ఉంటాయని భావం. ఎందుకంటే, ఎండాకాలంలో రోహిణి చివరి వరకూ విపరీతమైన ఎండలుంటాయి. పశువులకు మేతకూడా కరువే. పచ్చగడ్డి అసలే దొరకదు. ఎండుగడ్డిని, చొప్పను మేతగా వేస్తారు. ఆ తిండికి పశువులన్నీ వేసవిలో బక్కపడతాయి. మృగశిరలో వర్షాలు ప్రారంభమవుతాయి. ఆరుద్ర కార్తెలో ఎక్కువవుతాయి. భూమి పచ్చదనం అద్దుకుంటుంది. తర్వాత వచ్చే ఆశ్లేష కార్తెలో పచ్చగడ్డి పశువులు మేసే స్థితికి ఎదుగుతుంది. ఆ గడ్డిని తిని పశువులు బలంగా తయారవుతాయి. అలా ముసలి ఎడ్లుకూడా రంకెలేస్తూ పరుగెత్తే స్థితిలో కొస్తాయన్న భావనలోంచి ఈ సామెత పుట్టింది.
దొరల కచ్చరం ఎర్కేనా?
కచ్చరం ఒక అవసరం, ఒక ఆధారం, ఒక ఆస్తి, ఒక సాధనం. అంతేకాదు, ఒకప్పుడు దొరల ఠీవికూడా. అయితే ఇప్పుడు చాలావరకు ఎద్దులబండ్ల అవసరాలు తగ్గినా పూర్తిగా కనుమరుగు మాత్రం కాలేదు. వ్యవసాయంలో, పశుపోషణలో ఉపయోగిస్తూనే ఉన్నారు. కచ్చరం తెలంగాణ ప్రాంతంలో దొరలు ప్రయాణించిన బండి. మాములుగా బండ్లు వేప, మర్రి, తుమ్మ, మామిడి, నల్లమద్ది, చెక్కలతో చేస్తారు. దొరల కచ్చరాలు మాత్రం విలువైన ఎర్ర చందనం, బర్మా టేకు కర్రలతో అత్యంత నాణ్యతగా తయారు చేసేవాళ్ళు. ఈ కచ్చరాలకు పైన ఎండ కొట్టకుండా ముసుగు బిగించేవాళ్ళు. ముసుగు తయారీ కూడా నాణ్యతతోనే ఉండేది. కొన్ని కచ్చరాల్లో దొర కూర్చోడానికి పీఠం కూడా ఉండేది. బండి కుదుపులకు అటూ ఇటూ పడి పోకుండా ఇదెంతో సౌకర్యంగా ఉండేది.
ఒకరోజు బాగోతానికి మూతి మీసాలు..
తాత్కాలిక అవసరం కోసం శాశ్వతంగా ఉండాల్సిన దానిని పోగొట్టుకోవడం మంచిది కాదు. ఆ ఉద్దేశ్యంతో చెప్పిన సామెతే ‘ఒకరోజు బాగోతానికి మూతి మీసాలు గొరుక్కున్నట్లు’. దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు పెద్దలు. ఒక్కరోజు బాగోతంలో వేషం వేయడం కోసం, రోషానికి ప్రతీకగా ముచ్చట పడి పెంచుకుంటున్న మీసాలను గొరుక్కోవడం భావ్యమేకాదు. క్షణికావేశంతో తొందరపడితే అమ్యూలమైన వాటిని శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని ఈ సామెత ఉద్దేశ్యం.