దేశమంతా నేడు గురుకులాల వైపు చూస్తుందంటే దానికి బీజాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50 ఏండ్ల క్రితమే పడ్డాయి. మరో పదేండ్ల తర్వాత భారతదేశంలో గురుకులాలు సూ పర్ పవర్గా నిలుస్తాయని విద్యానిపుణులు సైతం జోస్యం చెబుతున్నారంటే దానికి అవసరమైన ఓ మలుపు ఐదు దశాబ్దాల క్రితమే జరిగింది. ఆధునిక గురుకుల విద్యాలయాలకు దశ, దిశ నిర్దేశించిన మేధావి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చలువతోనే సాధ్యమైందని అనుభవజ్ఞులు సైతం అం టున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య నందించేందుకు 1971లో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్లో సీఎం హోదాలో పీవీ నరసింహారావు దేశంలోనే మొట్ట మొదట గా నెలకొల్పిన గురుకులం..దేశవ్యాప్తంగా గురుకుల వ్యవస్థకే ప్రాణం పోసింది. ఇక్కడ విద్యనభ్యసించిన ఎంతోమంది ఆల్ ఇండియా సర్వీసుల్లో ఉద్యోగాలు పొంది దేశా నికి సేవలందిస్తున్నారు. ఇక్కడి గురుకుల పాఠశాల స్ఫూర్తితోనే ఉమ్మడి రాష్ట్రంలో ఆధునిక గురుకుల విద్యాలయాలకు సై తం అంకురార్పణ జరిగింది. ఈ ఫలితాలు.. కేంద్ర ప్రభు త్వం లోనూ చలనం తెప్పించి నవోదయ పాఠశాలలకు కార్యరూపం తెచ్చేలా చేశాయి. విద్యారంగానికే వన్నె తెచ్చేందుకు ఎన్నో కాంతి పుంజాలను ప్రసరింపజేయడంలో పీవీ నరసింహారావు ఆద్యుడిగా నిలిచారు. సాహిత్య పిపాసి అయిన పీవీ నరసింహారావు యాదాద్రిని సందర్శించిన సందర్భం లో ఇక్కడే ఎన్నో రచనలు సైతం చేశారు.
యాదాద్రి భువనగిరి, జూన్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామానికి చెందిన సర్వోదయ నాయకుడు మద్ది నారాయణరెడ్డి ఓ సందర్భంలో పశ్చిమబెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ను సందర్శించారు. ఆ సమయంలోనే ఆయన సర్వేల్ ప్రాంతంలో గురుకులాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. తన ఆలోచనను నాటి సీఎం పీవీ నరసింహారావుతో పంచుకున్నారు. అప్పటికే గీతాంజలి మాదిరిగా రాష్ట్రంలో ఓ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో పీవీ నరసింహారావు ఉండగా.. నారాయణ రెడ్డి ఆలోచన స్ఫూర్తిదాయకంగా అనిపించి సర్వేల్లో గురుకులం ఏర్పాటుకు బీజం వేశా రు. గురుకుల పాఠశాల ఏర్పాటుకు తన 40 ఎకరాల భూమిని ఇచ్చేందుకు నారాయణరెడ్డి ముందుకు రావడంతో 1971 నవంబర్ 23న పీవీ నరసింహారావు స్వయంగా వెళ్లి గురుకుల పాఠశాలకు ప్రారంభోత్సవం చేశారు. విరాళంగా ఇచ్చిన భూమిలోనే భవన నిర్మాణాలు ఉండటంతో అందులోనే గురుకులానికి సంబంధించిన తరగతులను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అలా ఆనాడు పీవీ నరసింహారావు ఆలోచనలకు అనుగుణంగా దేశంలోనే మొట్టమొదటగా సం స్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్లో ఏర్పాటైన గురుకులం దేశవ్యాప్తంగా ఏర్పాటవుతున్న ఆధునిక గురుకుల విద్యాలయాలకు నాంది పలికేలా చేసింది.
సర్వేల్లో గురుకుల పాఠశాల ఏర్పాటు తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే ఆంధ్రాలోని గుంటూరు జిల్లా పరిధిలో తాడికొండ వద్ద ఒక గురుకులం, రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాలో కొడిగనహల్లి వద్ద మరో గురుకుల పాఠశాల ఏర్పాటైంది. తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన వారికి సర్వేల్లో చదువుకునే అవకాశం కలగగా.. ఆంధ్రా ప్రాంతంలోని 9 జిల్లాల వారు తాడికొండ గురుకులంలో, రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాల వారు కొడిగనహల్లి గురుకులంలో చదువుకునేవారు. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1983-84 సంవత్సరంలో అప్పటి సీఎం ఎన్టీరామారావు తొలుత జిల్లాకు ఒక గురుకులాన్ని ఏర్పాటు చేయగా.. కాలక్రమంలో ప్రతి జిల్లాలో బాలబాలికలకు వేర్వేరుగా గురుకులాలు ఏర్పాటు చేశారు. గురుకుల పాఠశాలల్లో వస్తున్న ఫలితాలను చూసి కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ర్టాల్లో ఈ తరహా పాఠశాలలను ఏర్పాటు చేయాలని సంకల్పించి నవోద య పాఠశాలలను కార్యరూపంలోకి తెచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం 317 గురుకులాలు మాత్రమే ఉండగా.. కొత్త రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన 525 గురుకులాలు హర్షించదగ్గ స్థాయిలో విద్యారంగ అభివృద్ధికి బాటలు వేశాయి.
దశదిశలా వ్యాప్తి..
పీవీ నరసింహారావు ఆనాడు స్థాపించిన సర్వేల్ గురుకుల పాఠశాల అతితక్కువ కాలంలోనే ఉత్తమ ఫలితాలను సాధించి ఆదర్శంగా నిలిచింది. ఇక్కడి గురుకుల పాఠశాల ఫలితాలు దశదిశలా వ్యాపించి ఎన్నో ఆధునిక గురుకులాల ఏర్పాటుకు దోహదపడింది. చదువుతోపాటు నైతిక విలువలు, అంకితభావం, నిబద్ధత వంటి సుగుణాలను విద్యార్థులకు నేర్పుతూ వస్తున్నా రు. పాఠశాల స్థాయిలోనే నాయకత్వ లక్షణాలతో పాటు వివిధ క్రీడల్లో తర్ఫీదునిస్తున్నారు. ఈ పరిస్థితులే ఎందరో ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడ్డాయి. ఇక్కడ చదివిన వారిలో ఎంతోమం ది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదిగారు. ఆల్ ఇండియా సర్వీస్లోనూ కొనసాగుతూ దేశానికి సేవలందిస్తున్నారు. ఇక ఇంజినీరింగ్, డాక్టర్లుగా, రాజకీయంగా ఎదిగిన వారు లెక్కకు మిక్కిలి. రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న బుర్రా వెంకటేశం, గవర్నర్ కార్యదర్శిగా పనిచేస్తున్న సురేంద్రమోహన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండిగా కొనసాగుతున్న దినకర్బాబు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ సొసైటీ ఎండిగా ఉన్న మల్లారెడ్డి, డీఐజీ టి.ప్రభాకర్రావు, వరంగల్ ఈస్ట్ జోన్ ఐజీ వై.నాగిరెడ్డి, ఐఏఎస్ డాక్టర్ ఎల్.శశిధర్ తదితరులంతా సర్వేల్ గురుకులంలో చదువుకున్నవాళ్లే. ఇక్కడి పాఠశాలలో చదివే విద్యార్థులు నాటి నుంచి నేటివరకూ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ వస్తున్నా రు. ప్రతి యేటా వంద శాతం ఫలితాలను సాధిస్తుండగా.. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో టాప్ టెన్ ర్యాంకుల్లోనూ ఇక్కడి విద్యార్థులు ఉంటుండటం గర్వకారణం. ఉన్నత లక్ష్యాలకు వేదికగా నిలుస్తున్న సర్వేల్ గురుకులం ఏర్పాటుకు ఆద్యుడైన పీవీ నరసింహారావును ఈ ప్రాంత విద్యార్థులు నిత్యం స్మరిస్తున్నారు. పాఠశాలలో పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆరాధిస్తున్నారు.