ప్రత్యేక ప్రతినిధి, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్లో ఏర్పడుతున్న జన్యు ఉత్పరివర్తనాలను ఎప్పటికప్పుడు పసిగట్టి, వాటిని ఎదుర్కొనే పరిశోధనలకు ఊతం ఇచ్చేందుకు హైదరాబాద్లోని సీసీఎంబీ నేతృత్వంలో నాలుగు సంస్థలు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. బెంగళూరులోని ఎన్సీబీఎస్-టీఐఎఫ్ఆర్, ఇన్స్టెమ్ -డీబీటీ, నిమ్హాన్స్, న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్-ఐజీఐబీ, పుణెలోని పుణె నాలెడ్జ్ క్లస్టర్, ఐఐఎస్ఈఆర్-పుణె, సీఎస్ఐఆర్-ఎన్సీఎల్ సంస్థలు కన్సార్షియంలో సభ్యులుగా ఉంటాయి. కేంద్రప్రభుత్వ ఆధీనంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలోని ఇండియన్ సార్స్-కొవిడ్-2 జీనోమిక్ కన్సార్టియం(ఇన్సాకాగ్) ఇప్పటికే పరిశోధనలు కొనసాగిస్తున్నది. కరోనా వైరస్ వేరియంట్లను పసిగట్టడానికి ఇన్సాకాగ్ జాతీయ స్థాయిలో చేస్తున్న కృషికి మరింత తోడ్పాటునందించేందుకు తమ పరిశోధనలు ఉపకరిస్తాయని సీసీఎంబీ ప్రకటించింది. ఈ కన్సార్టియంకు సీఎస్ఐఆర్-సీసీఎంబీ సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా నాయకత్వం వహిస్తున్నారు. కన్సార్షియం పరిశోధనలకు రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఆరంభ నిధిని సమకూర్చింది.