కొలంబో: శ్రీలంకలో ఉన్న ఇండియన్ టీమ్ ప్లేయర్ కృనాల్ పాండ్యా కొవిడ్ బారిన పడిన విషయం తెలుసు కదా. ఇప్పుడతనితో సన్నిహితంగా ఉన్న 8 మంది ఇండియన్ ప్లేయర్స్ శ్రీలంక సిరీస్ మొత్తానికీ దూరమయ్యారు. వీళ్లలో కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు. ఈ ప్లేయర్స్ అందరినీ ఐసోలేషన్లో ఉంచనున్నారు. దీంతో మిగతా రెండు టీ20లకు వీళ్లు అందుబాటులో ఉండబోవడం లేదు. దీంతో తుది జట్టును ఎంపిక చేయడం టీమ్ మేనేజ్మెంట్కు కష్టంగా మారనుంది. ఆ 8 మందిలో ధావన్ కాకుండా హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కృష్ణప్ప గౌతమ్, పృథ్వి షా, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, యజువేంద్ర చాహల్ ఉన్నారు. నిజానికి ఈ ప్లేయర్స్ అందరికీ నెగటివ్ అని తేలింది. అయినా వీళ్లను ఐసోలేషన్లో ఉంచాలని నిర్ణయించారు. మరోవైపు పాజిటివ్గా తేలిన కృనాల్ మరో హోటల్కు మారాడు. ఈ లిస్ట్లో పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ ఉండటంతో వాళ్లను ఇంగ్లండ్లో ఉన్న టెస్ట్ టీమ్ దగ్గరికి పంపించాలన్న బీసీసీఐ ప్లాన్స్ కూడా దెబ్బతిన్నాయి. వాళ్లను ఎలాగోలా ఇంగ్లండ్ పంపిస్తున్నా.. అది ఆలస్యం కానుంది. ఇండియా, శ్రీలంక మధ్య రెండో టీ20 ఇవాళ జరగనున్న విషయం తెలిసిందే.