కోల్కతా: దేశంలో ప్రతిపక్షం బలహీనంగా ఉన్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ ఆరోపించారు. అందుకే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన చేయాల్సిన పరిస్థితి దాపురించిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని బుధవారం కలిసిన రాకేశ్ తికాయిత్, గురువారం మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రతిపక్షం బలంగా ఉండి ఉండే, రైతులు నిరసనకు దిగాల్సిన పరిస్థితి ఉండేది కాదన్నారు. అందుకే విపక్షం బలంగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారన్నారని, సీఎం మమతకు ఇదే విషయాన్ని చెప్పినట్లు ఆయన తెలిపారు.
సీఎం మమతా బెనర్జీతో సమావేశం కావడాన్ని రాకేశ్ సమర్థించుకున్నారు. “నేను ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిని కలిశానా, దాని కోసం నేను భారత ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా ? సిఎంను కలవడానికి వీసా అవసరమా? ”అని రాకేశ్ ప్రశ్నించారు. రైతు విధానాలపై తాము అన్ని రాష్ట్రాల సీఎంలను కలుస్తామని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలుస్తానని ఆయన వెల్లడించారు.