ఫోన్లో పరిచయమై..ఆశ చూపాడు
బంగారం తాకట్టు పెట్టి అపరిచితుడికి అప్పజెప్పింది
విషయం తెలిసి లబోదిబోమంటున్నది
సైబర్ మోసగాడి చేతిలో ఘోరంగా మోసపోయిన ఓ మహిళ
ముక్కూ మొహం తెలియదు. ఎన్నడూ చూడలేదు. తెలిసిన వాడూ కాదు. కేవలం ఆన్లైన్లో పరిచయమయ్యాడు. ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగం ఉందని..లక్షలు సంపాదించవచ్చని ఎరవేశాడంతే. రంగురంగుల డాలర్ల కలలు కని వెనకాముందు చూసుకోకుండా ఓ పదిలక్షలు అతడికి సమర్పించుకున్నది. తీరా తాను మోసపోయానని తెలిశాక ఇప్పుడు బావురుమంటున్నది. అత్యాశకు పోయి సైబర్ నేరగాడి ఎరకు బలైపోయిన ఓ మహిళ వ్యథార్థ గాథ ఇది.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి జిల్లాకు చెందిన ఓ మహిళ పేరొందిన ఫార్మా కంపెనీలో ఉన్నత హోదాలో ఉద్యోగం చేస్తున్నది. అయితే విదేశాల్లో ఉద్యోగం కోసం పలు వెబ్సైట్లలో వివరాలు నమోదు చేసుకున్నది. ఇది కాస్త సైబర్ నేరగాడి కంట పడింది. ఒకరోజు ఆ మహిళకు విదేశీ నంబరు నుంచి ఫోన్ వచ్చింది. ఆస్ట్రేలియాలోని ఓ పెద్ద కంపెనీలో ఖాళీగా ఉన్న ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని నమ్మబలికాడు. వెంటనే ఉద్యోగమిప్పిస్తానని ఆశ చూపాడు. ఈ మాటలు గట్టిగా నమ్మిన సదరు మహిళ అస్ట్రేలియాలో ఉద్యోగం ఖాయమని ఆశపడింది. గుర్తు తెలియని వ్యక్తి చెప్పిన ప్రతి సారి విడతల వారీగా ఆన్లైన్లో నగదు జమ చేస్తూ పోయింది. ఇలా మొత్తం రూ.10 లక్షలు సైబర్ నేరగాళ్ల ఖాతాలో జమచేసింది.
ఈ నగదు కోసం ఆమె తెలిసిన వారి దగ్గర అప్పులు చేసింది. తన వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టింది. చివరకు ఇంకా డబ్బు కావాలని ఆ సైబర్ మోసగాడు అడగడంతో మోసపోయానని తెలుసుకున్నది. భర్తతో కలిసి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాథమికంగా ఫిర్యాదును విశ్లేషించిన పోలీసులు ఇది ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన ముఠా లేదా నైజీరియన్ దేశానికి చెందిన సైబర్ ముఠా పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా జమ చేసిన ఖాతాలను పరిశీలిస్తే వివిధ వ్యాలెట్లతో పాటు ఉత్తరాది బ్యాంక్ బ్రాంచ్ల చిరునామాలు ఉన్నాయి.
పదిలక్షలు చేజార్చుకున్న తర్వాత ఆ మహిళ పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎలాగైనా సరే నిందితుడిని పట్టుకోవాలని ప్రాధేయపడింది. తన డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులకు మొర పెట్టుకున్నది. అయితే నిందితుడి ఆనవాళ్లు తెలుసా..అని అడిగినప్పుడు మాత్రం తనకేమీ తెలియదని చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. మోసం చేసిన వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు కానీ.. ఎలాగైనా పట్టుకురావాలని అడగడంతో పోలీసులకు ఎలా బదులివ్వాలో అర్థం కాలేదు. కేవలం ఫోన్లో మాటలతో పరిచయమైన వ్యక్తిని నమ్మి ఏకంగా రూ.10 లక్షలు ఇచ్చేసి అంతులేని వేదనను అనుభవిస్తున్న ఆమె పరిస్థితిపై జాలి కలిగింది.
ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి విదేశాల్లో ఉద్యోగం, కార్పోరేట్ సంస్థలో ఉద్యోగం అనగానే సంబురపడకండి. వారి వివరాలు పూర్తిగా తెలుసుకోండి. వారు చెప్పిన దానికి కార్యాలయాలు మన నగరంలో ఉంటే నేరుగా వెళ్లండి. అంతేగాని ఉద్యోగం ఇచ్చే కంపెనీలు మిమ్మల్ని ముందుగా డబ్బులు అడగవు. డబ్బులు అడగగానే అది మోసమని గుర్తించుకోండి. హోటల్స్లో ఇంటర్వ్యూలు, ఉత్తరాది రాష్ర్టానికి వస్తే అక్కడ ఇంటర్వ్యూ ఉంటుందంటే నమ్మొద్దు.- హరినాథ్, ఏసీపీ రాచకొండ సైబర్ క్రైం విభాగం
రిటైర్డుమెంట్తో వచ్చిన డబ్బులు శేష జీవితంలో ఆసరాగా వస్తాయనుకున్నాడు.. బీమాతో లైఫ్కు ధీమా ఉంటుందని నమ్మించిన సైబర్నేరగాళ్లు కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి వద్ద నుంచి రూ.21లక్షలు దోచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బోయిన్పల్లికి చెందిన బాధితుడు రైల్వేలో టెక్నికల్ విభాగంలో పనిచేసి రిటైర్డు అయ్యాడు. మూడు నెలల కిందట బాధితుడికి ఫోన్ చేసి.. తాము ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ నుంచి మాట్లాడుతున్నాని చెప్పి రూ.53వేల విలువైన పాలసీని చేయించారు. తరువాత ఫోన్ చేసి ఆ పాలసీ కంటే ప్రీమియం ఎక్కువగా వచ్చేది మరొకటి ఉందని, మీకు త్వరగా పాలసీ డబ్బులు వస్తాయంటూ నమ్మించారు.
తాము చెప్పినట్లు పన్నులు చెల్లిస్తే చాలు.. సదరు పాలసీకి రావాల్సిన డబ్బులు భారీగా వెంటనే ఇప్పిస్తామంటూ బోల్తా కొట్టించారు. ఇలా వారి మాటలు విన్న బాధితుడు తనకు త్వరగా ఇన్సూరెన్స్ నుంచి భారీగా డబ్బులు వస్తున్నాయని ఆశపడ్డాడు. ఆ విశ్రాంత ఉద్యోగి పదవీ విరమణ సందర్భంగా వచ్చిన డబ్బులను మూడు నెలల కాలంలో 8 బ్యాంకు ఖాతాల్లో రూ.21 లక్షలు సైబర్నేరగాళ్లు చెప్పినట్లు డిపాజిట్ చేశాడు. తీరా ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసపోతున్నానని గ్రహించి బుధవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.