కరోనా వలన డిజిటల్ రంగంకు మరింత ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ప్రేక్షకులు టైం పాస్ కోసం ఓటీటీనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు కొత్త ఓటీటీ సంస్థలు నెలకొల్పేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే ఆహా అనే కొత్త ఓటీటీ ప్లాట్ ఫాంన్ను అల్లు అరవింద్ స్టార్ట్ చేయగా, త్వరలో నాగార్జున కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించనున్నాడని ఇటీవల ప్రచారం జరిగింది.
ఇక ఇప్పుడు బొద్దుగుమ్మ నమిత కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. రవివర్మ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్తో కలిసి ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుండగా, ఈ ప్లాట్ఫామ్కు నమిత టాకీస్ అని పేరు నిర్ణయించారు. చిన్న నిర్మాతలు, కొత్త దర్శకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఓటీటీని ప్రారంభిస్తున్నట్టు తెలిపిన నమిత ఈ ఓటీటీ ద్వారా కొత్త కాన్సెప్ట్తో కూడిన చిత్రాలు, సిరీస్లను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు పేర్కొన్నారు.