న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకంతో సత్తాచాటిన స్టార్ షట్లర్ పీవీ సింధును కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసల్లో ముంచెత్తారు. సింధు క్రీడా దిగ్గజమని, దేశం గర్వించదగ్గ అత్యుత్తమ ప్లేయర్లలో ఆమె ఒకరని ఠాకూర్ కీర్తించారు. వరుస ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత మహిళగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింధును మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి ఠాకూర్ మాట్లాడుతూ ‘సింధు.. భారత క్రీడా దిగ్గజం. దేశం తరఫున అంతర్జాతీయ క్రీడావేదికలపై ప్రాతినిధ్యం వహించాలని కలలు కనే వారికి ఆమె ఆదర్శం. వరుస విశ్వక్రీడల్లో రెండు పతకాలతో యువ ప్లేయర్లకు సింధు మార్గదర్శకంగా నిలిచింది. ఒలింపిక్స్ లాంటి మెగాటోర్నీలో పతకం సాధించేందుకు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్(టాప్స్) ఎంత కీలకమయ్యిందో సింధు అద్భుత విజయంలో కనిపిస్తున్నది’ అని అన్నారు. మరోవైపు సింధు స్పందిస్తూ ‘ నా ఈ అద్భుత ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రేక్షకుల్లేకుండా ఆడినా…దేశంలోని కోట్లాది మంది అభిమానులు నా వెన్నంటి నిలువడంతోనే ఈ విజయం సాధ్యమైంది. నన్ను అనునిత్యం ప్రోత్సహిస్తూ వస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. కోచ్ పార్క్ టై సంగ్ సహకారంతో నా కల సాకారం చేసుకోగలిగాను’ అని అంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, సింధు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంతకుముందు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింధుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే బుధవారం మధ్యాహ్నం సింధు.. హైదరాబాద్కు రానుంది. ఎర్రకోటకు ప్రత్యేక అతిథులుగా టోక్యో ఒలింపిక్స్లో భారత్ తరఫున పాల్గొన్న ఆటగాళ్లు ఈనెల 15న ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా రానున్నట్టు ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి.