న్యూఢిల్లీ: 1998 ఆసియాగేమ్స్ చాంపియన్, భారత మాజీ బాక్సర్ డింకో సింగ్ (42) కన్నుమూశారు. నాలుగేండ్లుగా కాలేయ క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన గురువారం మృతి చెందారు. గతేడాది కామెర్లు, కరోనా వైరస్ సోకడంతో ఆరోగ్యం క్షీణించినా తీవ్రంగా పోరాడిన డింకో కోలుకున్నారు. ఇప్పుడు క్యాన్సర్ తీవ్రమవడంతో లోకాన్ని విడిచారు. డింకోకు భార్య, కుమారుడు ఉన్నారు. బ్యాంకాక్లో జరిగిన 1998 ఆసియా క్రీడల్లో ఒలింపిక్ చాంపియన్ను చిత్తుచేసి డింకో స్వర్ణ పతకం సాధించారు. 1982 తర్వాత భారత్కు అదే తొలి పసిడి. 2000 సిడ్నీ ఒలింపిక్స్లోనూ ఆయన బరిలోకి దిగారు. మణిపూర్కు చెందిన డింకో ఇచ్చిన స్ఫూర్తితో చాలా మంది బాక్సింగ్ను కెరీర్గా మలుచుకునేందుకు ఆసక్తి చూపారు. 1998లో అర్జున అవార్డు సాధించిన డింకో.. 2013లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. భారత నావిక దళంలో ఫస్ట్క్లాస్ ఆఫీసర్గా పని చేస్తూనే ఇంపాల్లో యువ బాక్సర్లకు శిక్షణ ఇచ్చారు. డింకో మృతి పట్ల ప్రధాని మోదీ, కేంద్ర క్రీడా మంత్రి రిజిజు, బాక్సర్లు మేరీకోమ్, విజేందర్ సింగ్ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.