మొన్నటి వరకు హెల్మెట్ పెట్టుకోకుంటే, కారులో కూర్చున్న వారుసీటు బెల్టు ధరించకుంటే జరిమానాలు వేసిన పోలీసు శాఖ ఇక నుంచి ముఖానికి మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధించనున్నారు. గ్రేటర్లో కరోనా వ్యాప్తి కొనసాగుతుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలు అప్రమత్తం అయ్యాయి. బస్తీ దవాఖాన నుంచి మొదలు ఉస్మానియా, నిమ్స్ వంటి పెద్ద దవాఖానల వరకు రోగులతో పాటు సిబ్బంది కూడా మాస్కు ధరించాలని వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు దవాఖానల్లో కూడా ఈ నియమాలు వర్తిస్తాయన్నారు. రోగితో పాటు రోగి సహాయకులు సైతం మాస్కు ధరించాలని, ధరించనివారిని లోనికి అనుమతించవద్దని అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాల్లో రోగులు, వారి సహాయకులు మాస్కు లేకుండా దవాఖాన ఆవరణలో ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని వైద్యాధికారులు హెచ్చరించారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బంది సైతం మాస్కులు తప్పనిసరి ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాలు, జనావాసాలు, మార్కెట్లు, బస్టాప్లు, ఆలయాలు, రైతుబజార్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్మాల్స్, బట్టల దుకాణాలు తదితర వాటితో పాటు రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, విమానాశ్రయాలు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్స్ తదితర అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లలో కూడా మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మాస్కును ముక్కు, నోరును కవర్ చేసే విధంగా కాకుండా కేవలం నోటికి లేదా గదమ దగ్గర మాత్రమే మొక్కుబడిగా మాస్కు ధరించినా మాస్కు ధరించని వారికి విధించే జరిమానానే వారికి కూడా వర్తిస్తుందన్నారు. ప్రతిఒక్కరూ బయటకు లేదా ప్రజల మధ్యకు వస్తే విధిగా మాస్కు ధరించాల్సిందేన న్నారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో కరోనా నియమాలు తప్పనిసరని వైద్య, ఆరోగ్యశాఖ తేల్చిచెప్పంది. ప్రస్తుతం సెకండ్వేవ్కు కొందరి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని గుర్తించిన అధికారులు కరోనా నియమాల అమలు కఠినతరం చేశారు. ఈనేపథ్యంలో ఇక నుంచి గ్రేటర్ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, మార్కెట్లు, రైతుబజార్లు, షాపింగ్మాల్స్, ఇతర అన్నిరకాల బహిరంగ ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసు, జీహెచ్ఎంసీ అధికారులు మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి నియంత్రణకు సర్కిళ్ల వారీగా ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు అవగాహన కల్పిస్తామని చెబుతున్నారు. మాస్కు ధరించని వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి ఇక నుంచి జరిమానా తప్పదని అధికారులు హెచ్చరించారు.
కరోనా వ్యాప్తి కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచించారు. నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. కచ్చితంగా మాస్కుతో పాటు భౌతిక దూరం పాటించి, చేతులను శానిటైజేషన్ చేసుకుంటుండాలన్నారు. నిబంధనలను పాటించకుండా ఎవరు నిర్లక్ష్యం చేసిన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద రూ. వెయ్యి జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వాహనాలపై వెళ్తున్నప్పుడు మాస్కులు ధరించకపోతే సీసీ కెమెరాల ద్వారా ఆ వాహనం నంబ రు ఆధారంగా జరిమానాకు సంబంధించిన చలాన్ ఇంటికే పంపిస్తామన్నారు. రోడ్డు పై ఉమ్మేసినా జరిమానా తప్పదన్నారు. అదే విధంగా ఆటోలలో ఇద్దరు కన్నా ఎక్కువ, క్యాబ్లు, కారులలో ముగ్గురికి మించకుండా ప్రయాణించాలన్నారు.
సుల్తాన్బజార్,మార్చి 29: గత ఏడాది మార్చి 22 నుంచి కొవిడ్-19 కేంద్రంగా కొనసాగుతున్న కింగ్కోఠి జిల్లా దవాఖానలో కొద్ది రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 350 పడకల సామర్థ్యం ఉన్న ఈ దవాఖానలో 200 ఐసీయూ పడకలు ఉండగా 150 సాధారణ పడకలతో రోగులకు వైద్య సేవలందిస్తున్నారు.నిత్యం ఓపీ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని జిల్లా దవాఖాన కొవిడ్ కోఆర్డినేటర్ డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం దవాఖానలో కొవిడ్ ఇన్పేషెంట్ రోగుల సంఖ్య 116కు చేరిందన్నారు.సోమవారం 12మంది అడ్మిషన్లు పొందగా అందులో జీహెచ్ఎంసీ నుంచి 11మంది ఉంటే నాన్ జీహెచ్ఎంసీ ఒకరున్నారు. ఐసీయూలో 37 మంది,పేయింగ్ రూమ్లో 9 మంది మొత్తంగా కింగ్ కోఠి జిల్లా దవాఖాన కొవిడ్ కేంద్రంలో 116 మంది వైద్య చికిత్సలు పొందుతున్నారు.అయితే ఈ దవాఖానలో ఆర్టీపీసీఆర్తో పాటు ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.సోమవారం నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షల్లో 26 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని సెలవు రోజుల్లో కూడా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగిస్తోంది వైద్య, ఆరోగ్యశాఖ. సోమవారం హోలీ పండగ సెలవు రోజైనప్పటికీ గ్రేటర్లో వ్యాక్సినేషన్, టెస్టింగ్ ప్రక్రియలు యథావిధిగా కొనసాగాయి. గ్రేటర్ వ్యాప్తంగా 10,200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లో 6150, రంగారెడ్డి జిల్లాలో 2050, మేడ్చల్ జిల్లాలో 2000మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 7962మందికి టీకా వేసినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో 2104మందికి, రంగారెడ్డి జిల్లాలో 2658మందికి, మేడ్చల్ పరిధిలో 3200మందికి టీకా వేసినట్లు అధికారులు తెలిపారు.