తెలంగాణ ఏర్పాటు గురు మహర్దశలో జరిగింది. గురు నక్షత్రమైన పునర్వసు 4వ పాదంలో తెలంగాణ ఆవిర్భవించింది. లగ్నాధిపతి భాగ్యంలో, ధన-లాభాధిపతి పంచమంలో, సప్తమాధిపతి చతుర్థంలో ఉండటం వల్ల శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుంది. పాలకులు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజాశ్రేయస్సుకు దోహదం చేస్తాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. పాలకులు ప్రజారంజక పాలనను అందిస్తూ సంక్షేమ పథకాలను నిర్విరామంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
వర్ష లగ్నం (వర్షారంభం): ప్లవ నామ సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి 12/4/2021 ఉదయం 8-00 గంటలకు వృషభ లగ్నంలో ప్రవేశిస్తున్నది. లగ్న షష్ఠమాధిపతి ద్వాదశ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. వర్ష లగ్నం నుంచి సప్తమంలో కేతువు వల్ల దేశంలోని పశ్చిమ ప్రాంతాల్లో వర్షాల మూలంగా ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. తూర్పు ప్రాంతాల్లో అధికారులు, పాలకుల మధ్య విరోధాలు ఏర్పడవచ్చు. ఉత్తర ప్రాంతంలో అనుకూల వర్షపాతం, ఫలితంగా పంటలు బాగా పండి ధాన్య సమృద్ధి కలుగుతుంది. దక్షిణ ప్రాంతంలో అకాల వర్షాలు, కొన్నిచోట్ల వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. వీటి ప్రభావం పంటలపై ఉండవచ్చు.
మేష సంక్రమణం : ఈ సంవత్సరం 13-04-21 రా. 2-32 గంటలకు మకర లగ్నంలో మేష సంక్రమణం జరిగింది. లగ్నాధిపతి స్వక్షేత్రంలో ఉండటం, ధనాధిపతి లగ్నంలో ఉండటం శుభ సూచకం. సంవత్సర ప్రారంభంలో రాజకీయంగా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. తృతీయ, ద్వాదశాధిపతి ధన స్థానంలో ఉండటం వల్ల మిత్రదేశాలతో సంబంధాలు సజావుగా సాగుతాయి. వ్యాపార పరంగా ఆదాయం పెరుగుతుంది. చతుర్థ ఏకాదశాధిపతి షష్ఠమ స్థానంలో ఉండటం వల్ల దేశంలో శాంతిభద్రతలు నెలకొంటాయి. ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు.
ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. పంచమ, దశమాధిపతి చతుర్థంలో ఉండటం వల్ల విద్యారంగం అభివృద్ధి పథంలో సాగుతుంది. పాలకులు యువతకు అనుకూలమైన పథకాలు ప్రకటించే అవకాశాలున్నాయి. విద్యాభివృద్ధికి ప్రభుత్వాలు పాటుపడతాయి. షష్ఠమ, నవమాధిపతి తృతీయ స్థితి వల్ల దేశంలో స్నేహభావం తగ్గవచ్చు. దైవికభావన తగ్గి పరస్పర శత్రుత్వం పెరుగవచ్చు. పలు ప్రాంతాల్లో అరాచకాలు పెరుగుతాయి. సప్తమాధిపతి చతుర్థ స్థితి వల్ల వ్యాపారవృద్ధి. అష్టమాధిపతి చతుర్థంలో ఉండటం వల్ల కొన్ని ప్రాంతాల్లో అస్థిరత ఏర్పడవచ్చు.
ఈ సంవత్సరం అంతా శని తన స్వక్షేత్రం మకరరాశిలో సంచరించడం శుభప్రదం. అయితే, కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు, అనావృష్టి, ఈతి బాధలు తలెత్తవచ్చు. 20-06-2021 నుంచి 22-6-2021, 27- 9-2021 నుంచి 11-10-2021 వరకు మూడు గ్రహాలు వక్రగతితో సంచరిస్తుండటంతో ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతినవచ్చు. దేశంలో అల్లర్లు చెలరేగవచ్చు. 18-7-21 నుంచి 15-8-2021 వరకు పరస్పర శత్రు గ్రహాలైన గురు, శుక్రులు సమసప్తక స్థితి (ఎదురెదురుగా ఉండటం) వల్ల చోర, రోగ, అగ్ని భయాలుంటాయి. 13-4-2021 నుంచి 2-6-2021 వరకు కుజుడు శనిని వీక్షించడం, 2-6-2021 నుంచి 5-7-2021 వరకు శని, కుజుల సమసప్తక స్థితి వల్ల అనావృష్టి, ప్రజలలో అభద్రతా భావం,కలహాలు ఏర్పడవచ్చు. 31-12-2021 నుంచి సంవత్సరాంతం వరకు కాలసర్పయోగం వల్ల అధిపతులకు అరిష్టం.
ఈ సంవత్సరం కాల సర్పయోగం వివరణ : 31-12-2021 నుంచి 13-1-2022 వరకు, 28-1- 2022 నుంచి 13-2-2022 వరకు, 27-2-2022 నుంచి 10-3-2022 వరకు, 23-3-2022 నుంచి 2-4-2022 వరకు కాలసర్ప యోగాలు ఉన్నాయి. ఈ సమయంలో రాష్ట్రంలో, దేశంలో వాతావరణం వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. కలహాలు, చోర భయం, అనావృష్టి తదితర ఇబ్బందులు ఉండవచ్చు.
ఇవికూడా చదవండి..
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్సిగ్నల్
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!