ఢిల్లీని గెలిపించిన ధవన్
పంజాబ్కు రెండో ఓటమి
పరుగుల వరద పారిన సండే డబుల్ ధమాకా.. అభిమానులకు మజా నిచ్చింది. డబుల్ హెడర్లోని తొలి మ్యాచ్లో మ్యాక్స్వెల్, డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతే.. రెండో మ్యాచ్లో ధవన్ అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. తొలి మ్యాచ్లో భారీ స్కోరు చేసిన బెంగళూరు హ్యాట్రిక్ నమోదు చేస్తే.. రెండో మ్యాచ్లో గబ్బర్ గర్జనతో ఢిల్లీ గెలుపు బాట పట్టింది.
ముంబై: టీమ్ఇండియా ఓపెనర్ ధవన్ (49 బంతుల్లో 92; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్తో రెచ్చిపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (36 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్ (51 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు బాదడంతో.. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ధవన్, పృథ్వీ షా (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు. పంజాబ్ బౌలర్లలో రిచర్డ్సన్ 2 వికెట్లు పడగట్టాడు. ధవన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
బాదుడే బాదుడు..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు అదిరిపోయే ఆరంభం లభించింది. రాహుల్, మయాంక్ ధాటిగా ఆడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. లుక్మన్ మెరివాలా వేసిన రెండో ఓవర్లో 4,6,4 కొట్టిన మయాంక్.. వోక్స్ను రెండు ఫోర్లతో అరుసుకున్నాడు. ఫలితంగా 5 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 50/0తో నిలిచింది. ఒక వైపు అగర్వాల్ బౌండ్రీలతో విరుచుకుపడుతుంటే.. రాహుల్ మాత్రం వన్డే ఇన్నింగ్స్ తరహాలో యాంకర్ రోల్ పోషించాడు. ఈ క్రమంలో మయాంక్ 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తొలి వికెట్కు 122 పరుగులు జోడించాక మయాంక్ ఔట్ కాగా.. గేల్ (11), పూరన్ (9) ధాటిగా ఆడలేకపోయారు. హాఫ్సెంచరీ అనంతరం రాహుల్ ఔటైనా.. చివర్లో దీపక్ హుడా (22 నాటౌట్), షారుక్ ఖాన్ (15 నాటౌట్) భారీ షాట్లు కొట్టారు.
ధవన్ 92
భారీ లక్ష్యఛేదనలో ఓపెనర్లు ఢిల్లీకి మెరుపు ఆరంభాన్నిచ్చారు. ధవన్, పృథ్వీషా చెలరేగడంతో 5 ఓవర్లలో ఢిల్లీ 57/0తో నిలిచింది. అప్పటికే 3 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టిన షా.. మరో భారీ షాట్కు యత్నించి క్యాచ్ ఔట్ కావడంతో పరుగుల వేగం కాస్త తగ్గింది. స్మిత్ (9) ప్రభావం చూపలేకపోయాడు. 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న ధవన్ సెంచరీ చేయడం పక్కా అనుకుంటున్న దశలో రిచర్డ్సన్ అతడిని ఔట్ చేశాడు. దీంతో ఢిల్లీ గెలుపు సమీకరణం 30 బంతుల్లో 44 పరుగులకు చేరింది. స్టొయినిస్ (27 నాటౌట్) ధాటిగా ఆడటంతో ఢిల్లీ గెలిచింది.
స్కోరు బోర్డు
పంజాబ్: రాహుల్ (సి) స్టొయినిస్ (బి) రబడ 61, మయాంక్ (సి) ధవన్ (బి) మెరివాలా 69, గేల్ (సి) (సబ్) పటేల్ (బి) వోక్స్ 11, దీపక్ (నాటౌట్) 22, పూరన్ (సి) రబడ (బి) అవేశ్ 9, షారుక్ (నాటౌట్) 15, ఎక్స్ట్రాలు: 8, మొత్తం: 195/4. వికెట్ల పతనం: 1-122, 2-141, 3-158, 4-179, బౌలింగ్: వోక్స్ 4-0-42-1, మెరివాలా 3-0-32-1, అశ్విన్ 4-0-28-0, రబడ 4-0-43-1, లలిత్ 1-0-11-0, అవేశ్ 4-0-33-1.
ఢిల్లీ: పృథ్వీ షా (సి) గేల్ (బి) అర్శ్దీప్ 32, ధవన్ (బి) రిచర్డ్సన్ 92, స్మిత్ (సి) రిచర్డ్సన్ (బి) మెరెడిత్ 9, పంత్ (సి) హుడా (బి) రిచర్డ్సన్ 15, స్టొయినిస్ (నాటౌట్) 27, లలిత్ (నాటౌట్) 12, ఎక్స్ట్రాలు: 11, మొత్తం: 18.2 ఓవర్లలో 198/4. వికెట్ల పతనం: 1-59, 2-107, 3-152, 4-180, బౌలింగ్: అర్శ్దీప్ 3-0-22-1, షమీ 4-0-53-0, జలజ్ 3-0-27-0, రిచర్డ్సన్ 4-0-41-2, హుడా 2-0-18-0, మెరెడిత్ 2.2-0-35-1.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ నె,ర పా
బెంగళూరు 3 3 0 0.75 6
ఢిల్లీ 3 2 1 0.45 4
ముంబై 3 2 1 0.36 4
చెన్నై 2 1 1 0.61 2
రాజస్థాన్ 2 1 1 0.05 2
కోల్కతా 3 1 2 -0.63 2
పంజాబ్ 3 1 2 -0.96 2
హైదరాబాద్ 3 0 3 -0.48 0