బంజారాహిల్స్, ఏప్రిల్ 2: కార్మికనగర్లో జరిగిన వ్యక్తి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో హతుడి భార్య ప్రియుడు అలీ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధ్దారణకు వచ్చారు. హంతకుడు అలీతో పాటు హతుడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కొన్నిరోజులుగా సిద్ధిఖ్ అహ్మద్(38)కు అతడి భార్య రుబీనాకు గొడవలు జరుగుతున్నాయని, ఆ కారణంగానే అతడి హత్య జరిగి ఉండవచ్చని మృతుడి సోదరుడు మహ్మద్ అతిఖ్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశా రు. రుబీనా కాల్డాటాను పరిశీలించగా హత్యకు ముందు, తర్వాత స్థానికంగా మెకానిక్గా పనిచేస్తున్న మహ్మద్ అలీ అనే వ్యక్తితో మాట్లాడినట్లు తెలిపారు. దీంతో ఆమెను విచారించగా అతడితో ఉన్న సంబంధం గురించి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. రుబీనా ఇచ్చిన సమాచారం ఆధారంగా హత్య చేసిన వ్యక్తి అలీ అని నిర్ధారణకు వచ్చి న పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి శుక్రవారం తెల్లవారుజామున నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
మూడేండ్లుగా మృతుడి భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది. 20రోజుల క్రితం కూడా రుబీనాతో కలిసి ఉన్న అలీని హతుడు హెచ్చరించినట్లు తెలిసింది. తమ విషయం మొత్తం సిద్ధిఖీకి తెలిసిపోవడంతో అతడిని అంతం చేయాల్సిందేనని అలీ నిర్ణయించుకొని.. ఇదే విషయాన్ని రుబీనాకు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. కాగా మార్చి 30న రాత్రి 12గంటల ప్రాంతంలో రుబీనా అన్న ఫిరోజ్ ఇంట్లో విందు ముగించుకొని ఇంటికి బయలుదేరిన విషయాన్ని ఆమె అలీకి చెప్పడంతో అపార్ట్మెంట్వద్ద మాటు వేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు అలీ విశ్వప్రయత్నం చేసినట్లు ఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలను బట్టి తెలుస్తోంది.
సుమారు ఐదుగంటలకు పైగా ఘటనా స్థలంలోనే ఉన్న అలీ మృతదేహాన్ని ఏం చేద్దామనే విషయాన్ని గురించి రుబీనాతో కూడా ఫోన్లో చర్చించినట్లు తెలుస్తోంది. దుర్వాసన రాకుండా మృతదేహాన్ని ఫ్రిజ్లో ఉంచి కొన్నాళ్ల తర్వాత పారేయాలని భావించినా మృతదేహం ఫ్రిజ్లో పట్టకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. కాగా హత్య అనంతరం అక్కడ రక్తపు మరకలు లేకుండా శుభ్రపర్చడంతో పాటు హత్యకు ఉపయోగించిన పదునైన వస్తువును సంచీలో వేసుకుని తెల్లవారుజామున 5.30 ప్రాంతంలో అలీ బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సంచీతో పాటు అలీ ఉపయోగించిన బైక్ ఎక్కడ పెట్టారనే అంశంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.