యంగ్ గన్స్తో నిండి ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ 14వ సీజన్లో దూసుకెళ్తున్నది. వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకున్న ఢిల్లీ.. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్కు చేరువకాగా.. రాజస్థాన్ రాయల్స్ ఐదో పరాజయం మూటగట్టుకుంది. శ్రేయస్ అయ్యర్ మినహా తక్కినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో మొదట ఢిల్లీ ఓ మాదిరి స్కోరుకే పరిమితం కాగా.. చక్కటి బౌలింగ్తో క్యాపిటల్స్ను కట్టడి చేసిన రాజస్థాన్ బ్యాటింగ్లో తేలిపోయింది. కెప్టెన్ సంజూ శాంసన్ ఒంటరి పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు పరిమితమైంది.
అబుదాబి: బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా.. బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో ఢిల్లీ తిరిగి అగ్రస్థానానికి చేరింది. శనివారం ఇక్కడ జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 33 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసి 16 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. పంత్ సేన అనధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. రాజస్థాన్ ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (43), హెట్మైర్ (28), కెప్టెన్ రిషబ్ పంత్ (24) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తఫిజుర్, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో కెప్టెన్ సంజూ శాంసన్ (53 బంతుల్లో 70 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నా.. మిగిలినవాళ్లు విఫలమవడంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 121 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు లియామ్ లివింగ్స్టోన్ (1), యశస్వి జైస్వాల్ (5)తో పాటు డేవిడ్ మిల్లర్ (7), మహిపాల్ లోమ్రార్ (19), రియాన్ పరాగ్ (2) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోవడంతో రాజస్థాన్ 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ శాంసన్తో పాటు హార్డ్ హిట్టర్ తెవాటియా క్రీజులో ఉన్నా.. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో రాజస్థాన్ను అడ్డుకున్నారు. వీరిద్దరు భారీ షాట్లు ఆడలేకపోవడంతో సాధించాల్సిన రన్రేట్ పెరిగి శాంసన్ సేన ఓటమి పాలైంది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే (2/18), అశ్విన్ (1/20) రాణించారు. శ్రేయస్ అయ్యర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
రాజస్థాన్కు జరిమానా
ఢిల్లీ చేతిలో ఓటమి పాలైన రాజస్థాన్పై జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్కు కారణమైనందుకు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్కు రూ. 24 లక్షలు, జట్టు సభ్యులకు రూ. 6 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
స్కోరు బోర్డు
ఢిల్లీ: పృథ్వీ షా (సి) లివింగ్స్టోన్ (బి) సకారియా 10, ధవన్ (బి) కార్తీక్ 8, శ్రేయస్ (స్టంప్డ్) శాంసన్ (బి) తెవాటియా 43, పంత్ (బి) ముస్తిఫిజుర్ 24, హెట్మైర్ (సి) సకారియా (బి) ముస్తఫిజుర్ 28, లలిత్ (నాటౌట్) 14, అక్షర్ (సి) మిల్లర్ (బి) సకారియా 12, అశ్విన్ (నాటౌట్) 6, ఎక్స్ట్రాలు: 9, మొత్తం: 154/6. వికెట్ల పతనం: 1-18, 2-21, 3-83, 4-90, 5-121, 6-142, బౌలింగ్: ముస్తఫిజుర్ 4-0-22-2, లోమ్రర్ 1-0-5-0, సకారియా 4-0-33-2, కార్తీక్ 4-0-40-1, షంసి 4-0-34-0, తెవాటియా 3-0-17-1.
రాజస్థాన్: లివింగ్స్టోన్ (సి) పంత్ (బి) అవేశ్ 1, జైస్వాల్ (సి) పంత్ (బి) నోర్జే 5, శాంసన్ (నాటౌట్) 70, మిల్లర్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 7, లోమ్రర్ (సి) అవేశ్ (బి) రబడ 19, పరాగ్ (బి) పటేల్ 2, తెవాటియా (సి) హెట్మైర్ (బి) నోర్జే 9, షంసి (నాటౌట్) 2, ఎక్స్ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 121/6. వికెట్ల పతనం: 1-6, 2-6, 3-17, 4-48, 5-55, 6-99, బౌలింగ్: అవేశ్ 4-0-29-1, నోర్జే 4-0-18-2, అశ్విన్ 4-0-20-1, రబడ 4-0-26-1, అక్షర్ 4-0-27-1.