నాగర్ కర్నూల్ : మందులతో పాటు మానసిక ధైర్యం చాలా ముఖ్యమని జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ యల్. శర్మన్, ఎస్పీ వై. సాయి శేఖర్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలతో కలిసి కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష నిర్వహించారు.
కరోనా పాజిటివ్ అనేసరికి అనవసర భయాందోళనకు గురి అయి తమ ఇమ్యూనిటీని కోల్పోతున్నారని తద్వారానే వ్యాధి మరింత ఎక్కువై మరణాలు సంభవిస్తున్నాయన్నారు. లక్షణాలు కనిపిస్తే మందులు వాడడం మొదలుపెట్టాలన్నారు. కేసులు నమోదయిన అంశాలే పత్రికల్లో ప్రముఖంగా వస్తున్నాయని కోలుకున్న వారి వివరాలు ఎక్కువగా ప్రచారం చేయాల్సి ఉందన్నారు.
ఇందుకు జిల్లా స్థాయి అధికారులు ప్రతి రోజూ చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్న వారి వివరాలను మీడియాకు వివరించి ప్రజలలో మానసిక ధైర్యం పెంచాలని తెలిపారు. లాక్ డౌన్కు ముందే రాష్ట్ర వ్యాప్తంగా కేసుల నమోదు తగ్గుముఖం పట్టిందని, ఈ పది రోజుల లాక్ డౌన్ తో కేసులు మరింత తగ్గుముఖం పడతాయని భావిస్తున్నామన్నారు.
జిల్లాలో కోవిడ్ చికిత్సకు కావలసిన ఆక్సిజన్, మందులు, సిబ్బంది ఎంతకావాలన్నా టాస్క్ ఫోర్స్ కమిటీలో చర్చించి తక్షణమే సమకూర్చుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. రెమిడిసివియర్ ఇంజక్షను ఎన్నీ కావాలంటే అన్ని ఇండెంట్ పెట్టాలని, అందులో నుండి 5 నుండి 10 శాతం వరకు ప్రయివేట్ ఆసుపత్రులకు సైతం అందజేయాల్సిందిగా తెలియజేసారు.
కరోనా నియంత్రణ, కరోనా బాధితులకు అవసరమైన వాటి కోసం ఏ రోజు కారోజు నివేదిక ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల సేవలు ఎంతో బాగున్నాయని, అధికంగా కేసులు నమోదవుతున్న గ్రామాలలో పాఠశాలలు, హాస్టల్ , అంగన్ వాడీ, ఇతర ఏ ప్రభుత్వ కార్యాలయాన్నయినా ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ