భైంసా ఏఎస్పీ కారే కిరణ్ ప్రభాకర్
హంగిర్గాలో సీసీ కెమెరాలు ప్రారంభం
తానూర్, ఏప్రిల్ 30: శాంతి భద్రతల పరిరక్షణకే పోలీస్ వ్యవస్థ పని చేస్తున్నదని భైంసా ఏఎస్పీ కారే కిరణ్ ప్రభాకర్ అన్నారు. మండలంలోని బామ్ని, హంగిర్గా గ్రామాలలో సీసీ కెమెరాలను శుక్రవారం ప్రాంభించారు. ఏఏస్పీ కారే కిరణ్ ప్రభాకర్ను మాజీ మండల అధ్యక్షుడు బాశెట్టి రాజన్న, హంగిర్గా సర్పంచ్ బాలాజీ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉంటే నేరాలు జరగవని అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి వాహన దారుడు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని పేర్కొన్నారు. భైంసా పట్టణంలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావు పటేల్, ఆత్మ చైర్మన్ కానుగంటి పోతారెడ్డి, ముథోల్ సీఐ అజయ్బాబు, ఎస్ఐ గుడిపెల్లి రాజన్న, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు తాడేవార్ విఠల్, హంగిర్గా సర్పంచ్ బాలాజీ, టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, గంగాధర్ పాల్గొన్నారు.