చెన్నై: ఐపీఎల్ 14లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. బ్యాట్స్మెన్ స్పిన్ ఉచ్చులో చిక్కి ఉక్కిరిబిక్కిరయ్యారు. ఢిల్లీ బౌలర్ల ధాటికి బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ(44: 30 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్(24), ఇషాన్ కిషన్(26), జయంత్ యాదవ్(23) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. డికాక్(1), హార్దిక్ పాండ్య(0), కృనాల్ పాండ్య(1), పొలార్డ్(2) విఫలమయ్యారు. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా(4/24) ముంబైని వణికించాడు. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా స్టాయినీస్, రబాడ, లలిత్ యాదవ్ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబైకి శుభారంభం లభించలేదు. స్టాయినీస్ వేసిన మూడో ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ క్వింటన్ డికాక్(1)..వికెట్ కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులో ఉన్న రోహిత్తో పాటు సూర్య జోరుగా బ్యాటింగ్ చేశారు. అశ్విన్ వేసిన నాలుగో ఓవర్లో యాదవ్ ఒక ఫోర్ బాదగా, రోహిత్ 4, 6 కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. రబాడ బౌలింగ్లోనూ 14 రన్స్ రాబట్టారు. పవర్ప్లే ఆఖరికి 55/1తో నిలిచింది.
రోహిత్ దూకుడుగా ఆడుతుండటంతో ముంబై భారీ స్కోరు చేసేలా కనిపించింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న మిశ్రా మణికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించి ముంబైని దెబ్బకొట్టాడు. 9వ ఓవర్లో రోహిత్, హార్దిక్ పాండ్యను మిశ్రా ఔట్ చేశాడు. ఒక్కసారిగా తడబడి క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్లు టాప్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఆట కట్టించారు. మధ్య ఓవర్లలో తడబాటుతో మెరుపులు లేకుండానే ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో నిలకడగా ఆడుతున్న ఇషాన్ను మిశ్రా పెవిలియన్ పంపడంతో కనీసం 150 మార్క్ కూడా అందుకోలేకపోయింది.