జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగంలో గత కొద్ది రోజులుగా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. నగరంలో ఉన్న చెత్తను పూర్తి స్థాయిలో తొలగించాలని, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పారిశుధ్య రంగంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మొత్తం 429చెత్త తరలింపు వాహనాలు ఉదయం 6గంటలలోపే హాజరయ్యేలా సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లు చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్లు స్వయంగా పరిశీలించడంతో 98శాతం వాహనాలు రిపోర్టు చేస్తున్నాయి. ఒక్కో చెత్త కేంద్రం నుంచి రోజుకు మూడు సార్లు చెత్తను తరలిస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట ఉండే చెత్త కుప్పల తొలగింపునకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీకి చెందిన 2,713 స్వచ్ఛ ఆటోలు ఉండగా అందులో 2,570ఆటోలు, ప్రైవేటుకు చెందిన 783ఆటోలు ఉండగా అందులో 707 ఆటోలు ప్రతి రోజూ చెత్తను సేకరిస్తున్నాయి. మిగిలిన ఆటోలు మరమ్మతులు, తదితర కారణాలతో హాజరు కావడం లేదు. అయితే ప్రతి సర్కిల్లో ఇండ్ల నుంచి వంద శాతం చెత్తను సేకరించేందుకు అదనంగా ఇంకా.. ఎన్ని స్వచ్ఛ ఆటోలు అవసరముందనే వివరాలను జీహెచ్ఎంసీ అధికారులు సేకరిస్తున్నారు.
నగరంలో చెత్త తొలగింపు, పారిశుధ్య కార్యక్రమాలపై నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో మొత్తం 1,756 చెత్త కేంద్రాలు ఉండగా.. 840 కేంద్రాల్లో రోజుకు మూడు సార్లు చెత్తను తొలగిస్తున్నారు. మిగిలిన కేంద్రాల్లో రోజుకు రెండు సార్లు చెత్తను తొలగిస్తున్నారు. దీంతో చెత్త తరలింపు ప్రక్రియ పటిష్టంగా కొనసాగుతుండటంతో నగరంలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడింది.