హంగూ ఆర్భాటాలు, మాటలే పెట్టుబడిగా ఓ కారు డ్రైవర్.. సీఎం ఓఎస్డీ పీఏగా చెప్పుకుంటూ పలువురిని భారీగా మోసం చేశాడు. మోసపోయిన బాధితుల్లో జ్యోతిష్యులు, ప్రొఫెసర్లు, పోలీసులతో పాటు కొందరు పేద ప్రజలు ఉన్నారు. ఎక్కడకు వెళ్తే అక్కడ ఆర్భాటాలు చేసి.. గస్తీలో ఉండే పోలీసులకు మాస్కా కొడుతూ వారికి దగ్గరవుతాడు. అక్కడ తాను ఏ పనినైనా సునాయసంగా చేస్తానంటూ నమ్మిస్తాడు. బోర్డులు పెట్టిన ప్రభుత్వ స్థలాలను బాధితులకు చూపిస్తూ.. ఈ స్థలాలను మీకు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తానంటూ నమ్మిస్తాడు. తన కారులో బాధితులను ఎక్కించుకొని తిప్పుతూ.. తాను పలుకుబడి ఉన్న వ్యక్తిగా నమ్మకం కుదుర్చుకుంటాడు. ప్రభుత్వమే తనకు గన్మన్ను ఇచ్చిందని చెబుతూ.. మూడు నెలల్లో ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయిన అవుసోదపు సుధాకర్ భారీ మోసాలకు పాల్పడ్డాడు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన సుధాకర్ ఐదో తరగతి వరకు చదివాడు.. 2004లో నగరానికి వచ్చాడు. కారు డ్రైవర్గా ఆరేండ్లపాటు పనిచేశాడు. ఆ సమయంలో సచివాలయంలోకి వచ్చిపోయే వారిని గురించి పూర్తి అవగాహన తెచ్చుకున్నాడు. 2016లో మోసాలకు పాల్పడి.. మళ్లీ 2019 నుంచి తన రెండో దఫా మోసాలను మొదలు పెట్టి.. వాటిని 2021లో అమలు పరిచాడు. అందరినీ నమ్మించేందుకు వరంగల్ జిల్లా ధర్మసాగర్కు చెందిన సంగోజు నాగరాజును సెక్యూరిటీ గార్డుగా, బట్టల భీమయ్యను డ్రైవర్గా నియమించుకొని… బొమ్మ పిస్టోల్తో సీఎం ఓఎస్డీ పీఏగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడ్డాడు.
సుధాకర్.. తన గన్మన్, డ్రైవర్తో ఆర్భాటంగా ఆలయాల వద్దకు వెళ్తాడు. అక్కడ ఉండే సెక్యూరిటీ సిబ్బందికి తాను సీఎం ఓఎస్డీ పీఏనంటూ ప్రత్యేక దర్శనం చేయించుకుంటాడు. ఆలయం బయటకు వచ్చిన తరువాత సెక్యూరిటీ వాళ్లకు రెండు, మూడు వేలు ఇస్తాడు. అక్కడ స్పెషల్ పోలీసులున్నా వాళ్లకు కూడా ఇస్తాడు. ఇలా అక్కడ వాళ్లతో స్నేహం చేసుకుం టూ మీకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తానంటూ నమ్మిస్తాడు. ఇలా ఆయా ప్రాంతాల్లో ఆలయాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లి డబ్బుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ.. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు వసూలు చేశాడు. స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ సిబ్బందికి 150 గజాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేశాడు.
మాటలతోనే సుధాకర్ మాయ చేస్తుంటాడు. అతడి మాటలు సమాజంపై ఎంతో పట్టున్నవారు సైతం ఇలా బోల్తా పడుతారు. మంగళవారం ఇతడి మోసాలను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం వెలుగులోకి తేవడం తో, ఈ విషయం తెలుసుకొని పలువురు బాధితులు సాయంత్రానికి టాస్క్ఫోర్స్ పోలీసులను ఆశ్రయించారు. ఇందులో పోలీసులు కూడా ఉన్నారు. ఈ బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.