కామారెడ్డి, మే 20: రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వే దేశానికే ఆదర్శమని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్కు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. కొవిడ్పై కామారెడ్డిలోని కలెక్టర్ చాంబర్లో ప్రభుత్వ విప్ గోవర్ధన్, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే జాజాల సురేందర్, కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేతారెడ్డి, డీసీహెచ్ఎస్ అజయ్కుమార్, డీఎంహెచ్వో చంద్రశేఖర్తో గురువారం సమీక్షించారు. అనంతరం జనహితభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే.. బాధితులను వెంటనే హైదరాబాద్లోని గాంధీ దవాఖాన, ఈఎన్ఈ దవాఖానకు తరలించాలని, తన కార్యాలయానికి కూడా సమాచారం అందించాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. క్లిష్ట సమయంలో వైద్యాధికారులు, సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, వారి కృషితో పాజిటివ్ కేసుల సంఖ్య 14 శాతానికి తగ్గిందని అభినందించారు. జిల్లావ్యాప్తంగా కొవిడ్ చికిత్స కోసం 671 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, ఇందులో ప్రభుత్వ దవాఖానల్లో 200 బెడ్లు, ప్రైవేటు వైద్యశాలల్లో 471 బెడ్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. దోమకొండ, మద్నూర్, ఎల్లారెడ్డిలో కూడా ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయాలని విప్ గంప గోవర్దన్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హన్మంత్షిండే, జాజాల సురేందర్ కోరారని, ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ శరత్ను ఆదేశించారు. మండలస్థాయిలో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలను తాను కోరానని, ఇందుకోసం ప్రభుత్వ హాస్టళ్లను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.