ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పాల్గొన్న కొంతమంది ఆటగాళ్లు కొవిడ్ బారిన పడుతుండడంతో ఈ లీగ్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో విదేశీ ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఐతే కరోనా సోకిన ఆటగాళ్లు, సిబ్బంది మాత్రం ఇంకా భారత్లో ఉన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే తమ ఇళ్లకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీలో ఆ జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బ్యాటింగ్ కన్సల్టెంట్ మైకేల్ హస్సీలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నై టీమ్ ఢిల్లీలో ఉంది. బాలాజీ, హస్సీని ఎయిర్ అంబులెన్స్లో చెన్నైకి తీసుకెళ్లాలని చెన్నై యాజమాన్యం
నిర్ణయించింది. వీరిద్దరూ వైరస్ బారినపడటంతో కనీసం రెండు వారాల పాటు ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకోనున్నారు. లీగ్ వాయిదా పడటంతో చాలా మంది ఆటగాళ్లను ఇప్పటికే ఫ్రాంఛైజీలు తమ ఇళ్లకు పంపించాయి.