తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ చరిత్రలో తొలిసారి ఓ ట్రాన్స్జెండర్ ఎన్నికల బరిలో నిలిచిన విషయం విదితమే. మలప్పురంలోని వెంగర నియోజకవర్గం నుంచి ట్రాన్స్జెండర్ అనన్య కుమారి అలెక్స్ నామినేషన్ దాఖలు చేయగా.. రిటర్నింగ్ అధికారి వాటిని ఆమోదించారు. డెమోక్రటిక్స్ సోషల్ జస్టిస్ పార్టీ తరపున ఆమె పోటీ చేశారు.
అయితే ఆ పార్టీ నాయకుల నుంచే ఆ ట్రాన్స్జెండర్కు బెదిరింపులు వచ్చాయి. మానసిక వేధింపులు అధికమయ్యాయని, నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని అని అనన్య పేర్కొన్నారు. ఆ వేధింపులు భరించలేకనే ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. వెంగర నియోజకవర్గంలో ఎల్డీఎఫ్ అభ్యర్థిగా పి.జీజీ, ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) అభ్యర్థి కునాలీకుట్టి పోటీ పడుతున్నారు.