ఆదివారం 14 గంటలు సేవలు బంద్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: సత్వర నగదు బదిలీలకు సంబంధించిన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) వ్యవస్థకు త్వరలో అంతరాయం ఏర్పడనున్నది. టెక్నికల్ అప్గ్రెడేషన్ కారణంగా వచ్చే ఆదివారం (ఏప్రిల్ 18న) 14 గంటలపాటు ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులో ఉండవబోవని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సోమవారం వెల్లడించింది. ఆర్టీజీఎస్ సేవల సామర్థ్యాన్ని, డిజాస్టర్ రికవరీ టైమ్ను మెరుగుపరిచేందుకు ఈ వ్యవస్థను సాంకేతికంగా నవీకరించబోతున్నామని, ఏప్రిల్ 17న వ్యాపార కార్యకలాపాలు ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులో ఉండబోవని, అయితే ఈ సమయంలో నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్) వ్యవస్థ మాత్రం ఎప్పటి మాదిరిగానే పనిచేస్తుందని ఆర్బీఐ వివరించింది.