కురవి వీరభద్రుడి ఆలయంలో వైభవంగా వేడుక
హాజరైన అశేష భక్తజనం
కురవి, మార్చి 24 : భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కురవిలోని హనుమత్ సమేత శివాలయంలో ఆదిదంపతుల కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. వేదపండితులు నిర్ణయించిన సుముహూర్తాన రామలింగేశ్వరస్వామి వారు పార్వతీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ కావించారు. ప్రధాన పూజారి పారుపెల్లి రామన్న ఆధ్వర్యంలో వేద పండితులు శివకిరణ్, శ్రీకర్, పూజారులు తాటికొండ పుణ్యమూర్తి, తేజ, శివ ఉదయం గణపతిపూజతో ఆరంభించి ఏకరుద్రాభిషేకం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఈవో సత్యనారాయణ, చైర్మన్ బాదావత్ రామునాయక్ దంపతులు, కురవి సర్పంచ్ నూతక్కి పద్మా, నర్సింహారావు, హైదరబాద్కు చెందిన పొన్నాల సందీప్ దంపతులు, రాజశేఖర్ దంపతులు, రిటైర్డు ఆలయ ఈవో నూతక్కి జగదీశ్వర్ హాజరయ్యారు. కల్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కొడవటంచలో వైభవంగా నృసింహుడి లగ్గం
కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం అంగరంగా వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి నరసింహస్వామి, లక్ష్మీదేవిల కల్యాణం చూడముచ్చటగా జరుగగా వేలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రూరల్ జడ్పీ చైర్పర్సన్ జ్యోతి హాజరై పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం గరుడముద్ద, పుట్ట బంగారు సేవ నిర్వహించారు. సాయంత్రం అశ్వవాహన పూల సేవ నిర్వహించారు. నేరుగా పట్టువస్ర్తాలు అందచేసి వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. యాదాద్రికి తరహాలో ఆలయాన్ని తీర్చిదిద్దడంతో పాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.