ముంబై: టీ20 వరల్డ్కప్లో టీమిండియా మెంటార్గా ఎమ్మెస్ ధోనీ ( Mentor Dhoni )ని నియమించడంపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్కు ఫిర్యాదు అందినట్లు వార్తలు వస్తున్నాయి. లోధా కమిటీ సంస్కరణల్లో చెప్పిన విధంగా ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల క్లాజ్ను ఉల్లంఘిస్తుందన్నది ఆ ఫిర్యాదు సారాంశం. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా అపెక్స్ కౌన్సిల్కు ఈ ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఈయన ప్లేయర్స్, అడ్మినిస్ట్రేటర్లపై ఇలా పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఫిర్యాదులు ఎన్నో చేయడం విశేషం. ఈ క్లాజ్ కింద ఓ వ్యక్తి రెండు పదవులను చేపట్టకూడదు.
ధోనీ ఇప్పటికే ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఫిర్యాదు చేస్తూ గంగూలీ, జే షా సహా అపెక్స్ కౌన్సిల్కు సంజీవ్ గుప్తా లేఖ రాసిన మాట నిజమే. బీసీసీఐ రాజ్యాంగంలోని క్లాజ్ 38(4) ప్రకారం ఇది విరుద్ధమని అందులో పేర్కొన్నారు. దీనిపై అపెక్స్ కౌన్సిల్ తమ లీగల్ టీమ్ను సంప్రదించాల్సి ఉంది అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఓ టీమ్లో సభ్యుడిగా ఉన్న ధోనీ, మరో టీమ్కు మెంటార్గా ఎలా ఉంటాడన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై స్పష్టత కోరుతూ సంజీవ్ గుప్తా ఈ లేఖ రాశారు.