హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో రజత పతకంతో మెరిసిన యువ రెజ్లర్ రవికుమార్ దహియాతో పాటు కాంస్యం సాధించిన భారత హాకీ జట్టును సీఎం కేసీఆర్ గురువారం ప్రత్యేకంగా అభినందించారు. 41 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరతీస్తూ విశ్వక్రీడల్లో టీమ్ఇండియా కాంస్యం కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. తద్వారా జాతీయ క్రీడ హాకీ పునర్వైభవం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పతక సాధనకు తీవ్రంగా కృషి చేసిన భారత హాకీ కెప్టెన్ మన్ప్రీత్సింగ్తో పాటు జట్టు సభ్యులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. మరోవైపు రెజ్లింగ్ ఫైనల్ చేరి తృటిలో పసిడి చేజార్చుకుని రజతం సాధించిన రవి క్రీడాస్ఫూర్తి దేశ కీర్తిని ఇనుమడింపజేసిందని ఆయన అన్నారు. ఒలింపిక్స్ బాక్సింగ్లో పతకం గెలిచిన మూడో భారత బాక్సర్గా లవ్లీనా బొర్గోహై రికార్డుల్లోకెక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇదే జోరు కొనసాగిస్తూ భారత ప్లేయర్లు ఒలింపిక్స్లో విజయకేతనం ఎగరేసి మరిన్ని పతకాలు సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. మీరు చరిత్ర సృష్టించారు. దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతున్నది.