ముంబై: టీ20 వరల్డ్కప్కు టీమిండియాను ఎంపిక చేసిన తర్వాత ప్రధానంగా ఇద్దరిపైనే చర్చ జరిగింది. శిఖర్ ధావన్ ( Shikhar Dhawan ), యజువేంద్ర చాహల్లకు జట్టులో స్థానం దక్కకపోవడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే దీనిపై చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ వివరణ ఇచ్చాడు. ధావన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో చాలా ముఖ్యమైన ప్లేయర్ అని, అయితే ప్రస్తుతం ఇతర ప్లేయర్స్కు అవకాశం ఇవ్వడానికే అతనికి విశ్రాంతి ఇచ్చినట్లు చేతన్ చెప్పాడు. సెలక్షన్ కమిటీ మీటింగ్లో ఏం చర్చించామన్నది నేను చెప్పలేను. అయితే ప్రస్తుతానికి అతనికి రెస్ట్ ఇచ్చాం. త్వరలోనే అతడు మళ్లీ టీమ్లోకి వస్తాడు అని చేతన్ శర్మ చెప్పాడు.
టీమ్లో రోహిత్, రాహుల్, ఇషాన్ కిషన్ రూపంలో ముగ్గురు ఓపెనర్లు ఉన్నారని.. ఇక కోహ్లిని ఓపెనింగ్ ఆడించాలనుకుంటే టీమ్ మేనేజ్మెంట్ ఇష్టమని చేతన్ స్పష్టం చేశాడు. ఇషాన్ కిషన్ మిడిలార్డర్లోనూ ఫిట్ అవుతాడని, అతడు తమకు చాలా ఆప్షన్స్ ఇస్తున్నాడని చెప్పాడు. ముగ్గురు వికెట్ కీపర్లను ఎంపిక చేసినట్లుగా చూడకూడదని, రాహుల్ ఎమర్జెన్సీ అయితే మాత్రమే ఆ బాధ్యతలు చేపడతాడని అన్నాడు.
ఆల్రౌండర్లదే కీరోల్
టీ20లలో ఆల్రౌండర్లదే కీలకపాత్ర అని, అందుకే చాలా వరకూ వాళ్లవైపే మొగ్గు చూపినట్లు చేతన్శర్మ తెలిపాడు. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ల రూపంలో ఆల్రౌండర్ల ఉన్నారు. వికెట్లు టర్న్ అయితే జడేజా, అక్షర్ ఉన్నారు. హార్దిక్ బెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడు. అందుకే టీమ్ మొత్తాన్ని ఆల్రౌండర్లతోనే నింపేశామని చెప్పాడు. హార్దిక్ తన పూర్తి కోటా బౌలింగ్ కూడా చేస్తాడని స్పష్టం చేశాడు.
ఇక సీనియర్ చాహల్ను కాదని యువ రాహుల్ చహర్ను తీసుకోవడంపైనా చేతన్ శర్మ స్పందించాడు. యూఏఈ వికెట్లపై కాస్త వేగంగా బౌలింగ్ చేసే రాహుల్ చహర్ వికెట్లు తీయగలడని తాము విశ్వసించినట్లు చెప్పాడు. చాహల్ గురించి కూడా చర్చించినా.. చివరికి రాహుల్ చహర్వైపే మొగ్గు చూపినట్లు తెలిపాడు. నటరాజన్ రూపంలో ఓ లెఫ్టామ్ పేస్ బౌలర్ గురించి చర్చించామని, అయితే అతడు చాలా కాలంగా క్రికెట్కు దూరంగా ఉండటంతో చివరికి తీసుకోకూడదని నిర్ణయించినట్లు చేతన్ చెప్పాడు.