లక్నో : యాపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల పర్వానికి బ్రేక్ పడటం లేదు. ఆగ్రా జిల్లాలోని పిన్హట్ ప్రాంతంలో దళిత మహిళ(25)పై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. సోమవారం మన్సుక్పరా ప్రాంతంలోని పుట్టింటికి వెళ్లి మహిళ తిరిగివస్తుండగా ఈ ఘోరం జరిగింది. బాధితురాలి భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి తాము ఇంటికి తిరిగివస్తుండగా భార్య మార్కెట్ వద్ద పని ఉండటంతో అక్కడే ఉండిపోగా, తాను పిల్లలను తీసుకుని ఇంటికి వెళ్లానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భర్త వివరించారు.
ఇక మార్కెట్ వద్ద పనిముగించుకుని మహిళ ఇంటికి బయలుదేరగా గ్రామ పెద్ద అభిషేక్ త్యాగి, ప్రస్తుత సర్పంచ్ భర్త తమ వాహనంలో ఆమెను ఎక్కించుకున్నారు. కారులో మరో ముగ్గురు ఉండగా అభిషేక్, వినోద్ త్యాగి తన భార్యను లైంగికంగా వేధించారని బాధితురాలి భర్త ఆరోపించారు. మహిళ అపస్మారక స్ధితిలో ఉండగా రోడ్డు పక్కన పడవేసి వారు పారిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐదుగురు నిందితులపై ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.