క్షత్రం క్షయాయ విధినోపభృతం
బ్రహ్మధ్రుగుజ్ఝిత పథం నరకార్తిలిప్సు
ఉద్ధన్త్యసావవనికణ్టకముగ్రవీర్యస్
త్రిఃసప్తకృత్వ ఉరుధారపరశ్వధేన ॥
శ్రీమద్భాగవతం (2.7.22)
‘ప్రజలను పాలించే క్షత్రియులు సన్మార్గాన్ని, సత్యసంధతను వీడటంతో ధర్మం దారి తప్పింది. నరక లోకాలను తలపించేలా భూతలానికి కంటకులై చరిస్తున్న నిరర్థకమైన రాజులందరినీ భగవంతుడు తన పరశురామావతారంలో సమూల ప్రక్షాళన గావించాడు. పదునైన గొడ్డలితో భూమండలాన్ని 21సార్లు చుట్టేసి, దుష్టక్షత్రియులను పెకిలించి వేశాడు’. ‘లోకంలో ధర్మం క్షీణించి అధర్మం ప్రబలినపుడు తాను అవతరించి దుష్టులను శిక్షిస్తానని’ భగవంతుడే ‘భగవద్గీత’లో ప్రకటించాడు. శ్రీపరశురామునిది భగవంతుని లీలావతారం. దుష్టులను సంహరించేందుకు ప్రత్యేకంగా అవతరించిన ‘శక్త్యావేశ అవతారం’ (దుష్ట-దమన శక్తి)గానూ ధర్మశాస్ర్తాలలో అది
వర్ణితమైంది.
‘శక్త్యావేశ అవతారం’ అంటే భగవంతుడు ప్రత్యక్షంగాగాని లేదా పరోక్షంగాగాని ఉద్భవించే ‘మహోగ్ర శక్తి స్వరూపం’. స్వయంగా భగవంతుడే అవతరించినపుడు అది సాక్షాత్ లేదా ప్రత్యక్ష ‘శక్త్యావేశ అవతారం’గా పిలువబడుతుంది. అదే ఒక జీవాత్మ భగవంతుని ప్రత్యేక శక్తికి లేదా విభూతికి ప్రతినిధియై అవతరించినపుడు దానిని ‘ఆవేశ’ లేదా ‘పరోక్ష శక్త్యావేశ’ అవతారంగా పరిగణిస్తాం. శ్రీల జయదేవ గోస్వాములవారు ‘దశావతార స్తోత్రం’లో పరశురామావతారాన్ని ఇలా కీర్తించారు:
క్షత్రియ రుధిరమయే జగదపగత పాపమ్
స్నపయసి పయసి శమిత భవతాపమ్
కేశవ ధృతభృగు పతిరూప జయ జగదీశ హరే॥
‘భృగుపతి రూపాన్ని ధరించిన ఓ కేశవా! ఓ జగదీశా! ఓ హరి! నీకు జయము జయము. నీవు అసురుల వంటి క్షత్రియులను వధించి జగత్తులోని పాపాలను కడిగేశావు. నీవల్ల ప్రజలు భవతాపం నుండి ఉపశమనం పొందారు’.
19వ త్రేతాయుగంలో పరశురాముడు, 24వ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అవతరించారని ‘మత్స్యపురాణం’ పేర్కొన్నది. ఆనాటి రాజులు సర్వాధిపత్యం కోసం పోట్లాడేవారు. తమ బలపరాక్రమాలతో మదోన్మత్తులు, అతిగర్వితులయ్యేవారు. అంతటితో ఊరుకునేవారు కాదు. బ్రహ్మనిష్ఠతో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్న ఋషులను హింసించేవారు. రాజులు సద్ధర్మపాలనను కొనసాగించేందుకు అవసరమైన సూచనలను సాధారణంగా ఋషులే అందిస్తారు. అటువంటి సాధుమహాత్ములపట్ల అధర్మపరులైన రాజుల అపరాధాలు ఉధృతమయ్యాయి. వీరికి నిట్టనిలువు నిదర్శనం కార్తవీర్యార్జునుడు. అతను సన్మార్గాన్ని వీడి పెడద్రోవ బట్టి, ప్రజల బాగోగులను విస్మరించడంతో లోకం దయనీయ స్థితిలో పడింది. ఈ సంక్లిష్ట వేళ అటువంటి దుష్టపాలకులను శిక్షించేందుకు అవతరించినవారే శ్రీపరశురామ ప్రభువులు. తాను ఒక సద్బ్రాహ్మణుడిగా జన్మించినా భవిష్యత్తులో తాను తలపెట్టబోయే యజ్ఞానికి అవసరమైన విలువిద్యల్లో నిష్ణాతుడై, అసమాన పరాక్రమాలనే ప్రదర్శించాడు.
‘పరశురాముడు యుద్ధానికి సిద్ధపడకుండా, అహింసా మార్గంలో తన నిరసనను తెలుపుతూ, రక్తపాతాన్ని నివారించ గలిగి వుండవచ్చు కదా?’ అనే సందేహం పలువురికి రావచ్చు. శ్రీల ప్రభుపాదులవారే దీనికి దీటైన సమాధానం చెప్పారు- ‘కృష్ణార్జునులకు కూడా కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన వలసిన అవసరం లేదు. కానీ, సామదాన భేదోపాయాలు విఫలమైనప్పుడు ధర్మసంస్థాపన కోసం భగవానునికి దండోపాయం ప్రయోగించక తప్పలేదు’. ‘కురుక్షేత్ర యుద్ధానికి ముందు సాక్షాత్తు భగవంతుడే శాంతిమార్గం కోసం ప్రయత్నించినా, అవతలివారు యుద్ధాన్నే కోరుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో ధర్మకార్యం కోసం హింస అనివార్యమైంది’ (భగవద్గీత: 3-20). ఇదే విధంగా, ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించవలసిన రాజులే ధర్మం తప్పితే ధర్మాన్ని స్థాపించవలసింది భగవంతుడే. పరశురాముడు దుష్టశిక్షణ గావించి వుండకపోతే, వారి ఆకృత్యాలకు అంతం ఉండేది కాదు.
‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు వైవిధ్యభరితమైన తన విభూతి తత్త్వాన్ని (10.31) వివరిస్తూ ‘శస్త్రధారులలో తాను రాముడను’ అన్నాడు. ప్రముఖ వైష్ణవ భాష్యకారులైన శ్రీల బలదేవ విద్యాభూషణులవారు, ‘రాముడను.. అంటే, రామాయణంలోని శ్రీరామచంద్రమూర్తిగాక శస్త్రధారుడైన శక్త్యావేశమూర్తి శ్రీపరశురాములవారు’ అని సూచించడం గమనార్హం. దుష్ట క్షత్రియుల బారినుండి ప్రజలకు విముక్తి గావించిన పరశురాముడు అంతిమంగా సరస్వతీ నదిలో స్నానమాచరించి తన యజ్ఞాన్ని ముగించాడు. పరమ పవిత్రమైన ఈ ‘పరశురామ జయంతి’ తిథిన ఆయనను స్మరిద్దాం. మనలను సదా రక్షించమని ఆ పరశురామ ప్రభువులను వేడుకుందాం. శ్రీ పరశురామ ప్రభూకీ జై!