పల్లె ప్రగతి పనులతో చెన్నారావు పేటకు కొత్త కళ
పూర్తయిన పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం
ఎటు చూసినా పరిశుభ్రమైన వీధులు, పచ్చని చెట్లు
అద్దంలా మెరుస్తున్న సీసీ రోడ్లు
హరితహారంలో నాటిన పది వేల మొక్కలుచెన్నారావుపేట మేజర్ గ్రామపంచాయతీ జనాభా 4044 మంది ఉండగా, ఓటర్లు 3150 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను పాలకవర్గం పక్కా ప్రణాళికతో ఖర్చు చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. హరితహారంలో భాగంగా పదివేల మొక్కలను నాటి, వాటి సంరక్షణకు వారంలో మూడు రోజులు నీరందిస్తోంది. ఇంటింటా పంపిణీ చేసి నాటిన పండ్ల మొక్కలు ఫలాలనిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనంలో నీడ, పండ్ల మొక్కలను నాటారు. నర్సరీలో తులసి, మల్లె, నిమ్మ, దానిమ్మ, తదితర మొక్కలను పెంచుతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా డంపింగ్ యార్డుకు రూ. 2.4 లక్షలు, అంతిమ యాత్ర సాఫీగా సాగేందుకు రూ.7లక్షలతో వైకుంఠధామాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పాలకవర్గం చొరవతో ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుడుగుంతలు నిర్మించుకున్నారు.
నిత్యం చెత్త తరలింపు..
ప్రభుత్వం అందించిన ట్రాక్టర్తో ప్రతి రోజూ చెత్తను సేకరించి తరలిస్తున్నారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటడంతో చెన్నారావు పేట పచ్చందాలు పరుచుకుంది. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు అందిస్తున్నారు.