చెన్నై: దేశంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా ఇప్పటికే సాయం చేశాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) యాజమాన్యం తనవంతు సాయం చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.
తమిళనాడు రాష్ట్రానికి 450 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
మొదటి విడత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని, మిగిలినవి వచ్చే వారం చేరుకుంటాయని తెలిపింది. ప్రభుత్వ ఆస్పత్రులలో, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల కోసం కాన్సన్ట్రేటర్లను పంపిణీ చేయనుంది. మాస్క్ ధరించండి. సురక్షితంగా ఉండండి అంటూ చెన్నై ఫ్రాంఛైజీ సోషల్మీడియాలో అవగాహన కల్పిస్తోంది. తమిళనాడులో శనివారం ఒక్కరోజే 27,397 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 241 మంది ప్రాణాలు కోల్పోయారు.