హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో పతకాలతో సత్తాచాటాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీవోఏ) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన చీర్ ఫర్ ఇండియా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. క్రీడాభివృద్ధికి అన్ని నియోజకవర్గాల్లో మైదానాలను నిర్మిస్తున్నామని తెలిపారు. దేశం తరఫున టోక్యో విశ్వక్రీడల్లో పోటీపడుతున్న 119 మంది అథ్లెట్లకు మంత్రి శ్రీనివాస్గౌడ్ చీర్స్ చెప్పారు. విశ్వవేదికపై అత్యుత్తమంగా రాణించి దేశానికి మరింత ఖ్యాతి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, టీవోఏ ఇంచార్జ్ అధ్యక్షుడు వేణుగోపాలచారి, ఉపాధ్యక్షుడు ప్రేమ్రాజ్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్యాదవ్, ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్కుమార్, సీనియర్ స్కేటర్ అనూప్కుమార్, సాట్స్ అధికారులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.