కీసర, ఏప్రిల్ 12: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తూ అండగా ఉంటున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గోధుమకుంట గ్రామానికి చెందిన చీర సత్తయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 15వేలు, యాద్గార్పల్లికి చెందిన నర్సింహకు రూ.60వేలు, నాగేశ్కు రూ.60వేల చొప్పున సోమవారం మంత్రి ఆయన నివాసంలో వారికి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దవాఖానలో చికిత్స పొంది బిల్లులు పెట్టుకున్న వారందరికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికి వేలాదిమందికి ఈ స్కీం కింద ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతనే అన్నివర్గాలకు సముచిత న్యాయం జరుగుతున్నదన్నారు. దరఖాస్తు చేసుకొన్న ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు.
ఘట్కేసర్ మున్సిపాలిటీకి చెందిన ముగ్గురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి ఆయన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని ఈ పథకం మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. పేదలు దవాఖానలకు వెళ్లి అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో సీఎం సహాయనిధి కింద ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారని తెలిపారు. సంజీవ రూ. 21వేలు, అమినాబేగం రూ. 60 వేలు, సువర్ణ రూ. 20 వేల చెక్కులను మంత్రి అందుకున్నారు. చైర్పర్సన్ పావనీ జంగయ్యయాదవ్, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వారి జీవితాలకు భరోసా కల్పిస్తున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామానికి చెందిన రాజమణికి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా మంజూరైన రూ. 25 వేల చెక్కును మంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఆమెకు అందజేశారు. టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, లంబాడ సంక్షేమ సమితి అధ్యక్షుడు ధన్రాజ్ నాయక్ పాల్గొన్నారు.