డిజిటల్ లావాదేవీలకు మొగ్గు చూపని మహిళలు: సర్వే
న్యూఢిల్లీ, మార్చి 8: డిజిటల్ లావాదేవీలు ఎంత పెరిగినా.. మహిళలు మాత్రం నగదు లావాదేవీలకే మొగ్గు చూపుతున్నారు. 65 శాతానికిపైగా మహిళలు నగదు లావాదేవీలకే అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు దేశవ్యాప్తంగా 3,500లకుపైగా రిటైల్ స్టోర్లలో చేపట్టిన ఓ సర్వేలో తేలింది. మిగిలిన వారు ఆధార్పే, యూపీఐ క్యూఆర్ కోడ్స్, డెబిట్ కార్డులను వినియోగిస్తున్నట్లు ఫిన్టెక్ సేవల సంస్థ ‘పేనియర్బై’ స్పష్టం చేసింది. ఇక నగదు ఉపసంహరణ, మొబైల్ రీచార్జ్లు, బిల్ పేమెంట్లు.. రిటైల్ టచ్ పాయింట్ల వద్ద మహిళా వినియోగదారులు ఎక్కువగా చేస్తున్న లావాదేవీలని వెల్లడైంది. నగదు ఉపసంహరణలు అధికంగా రూ.1,000-2,500 శ్రేణిలోనే ఉంటున్నాయని సర్వే తెలిపింది. నగరాలు, పట్టణాల్లోగల ఉద్యోగాలు చేస్తున్న 31-40 ఏండ్ల మహిళలు ఎక్కువగా (45%) ఈ లావాదేవీలను జరుపుతుండగా, 20-30 ఏండ్ల వయసువారు (25%) ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు.
రిటైల్ రుణగ్రహీతల్లో మహిళల శాతం పెరుగుతున్నదని, మొత్తం రుణాల్లో స్త్రీల వాటా 28 శాతంగా ఉన్నదని క్రెడిట్ బ్యూరో ట్రాన్స్యూనియన్ సిబిల్ తెలిపింది. ప్రస్తుతం రిటైల్ క్రెడిట్ మార్కెట్లో మహిళా రుణగ్రహీతలు 4.7 కోట్లుగా ఉన్నారని తాజా నివేదికలో సిబిల్ పేర్కొన్నది. 2014 సెప్టెంబర్ నాటికి 23 శాతంగా ఉన్న మహిళా రుణగ్రహీతలు.. గతేడాది సెప్టెంబర్ ఆఖరుకు 28 శాతానికి పెరిగారని తేల్చింది. వార్షిక వృద్ధిరేటు మహిలల్లో 21 శాతంగా, పురుషుల్లో 16 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. కాగా, ఇప్పటిదాకా మహిళలకు రూ.15.1 లక్షల కోట్ల రిటైల్ రుణాలు మంజూరయ్యాయని, గత ఆరేండ్లలో 12% వార్షిక వృద్ధి కనిపించిందని సిబిల్ తెలియజేసింది.