హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలుగురాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్ చేశారు. కశ్మీర్కు ఓ న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా అని నిలదీశారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. శాసనసభ, శాసనమండలి సీట్లను పెంచుతామంటూ రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని అన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపునకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు గతంలోనే విజ్ఞప్తిచేస్తే.. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని, 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని ప్రధాని మోదీ జవాబిచ్చారని గుర్తుచేశారు. ఇదే సూత్రం జమ్ము,కశ్మీర్కు ఎందుకు వర్తించదని నిలదీశారు. ఒకే దేశం-ఒకే చట్టం అంటే ఇదేనా? ఇదెకడి న్యాయం అంటూ మోదీ సర్కార్ తీరును ఆక్షేపించారు. రాజకీయ కుయుక్తులను కట్టిపెట్టి తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలని డిమాండ్ చేశారు.