‘టెస్టు మ్యాచ్లు నెగ్గాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేయాల్సిందే’ఇటీవలి కాలంలో టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీతో పాటు కోచ్ రవిశాస్త్రి నుంచి వినిపిస్తున్న మాటలివి. కానీ ఇంగ్లండ్ పర్యటన విషయానికి వస్తే.. మన బౌలర్లు సత్తాచాటినా.. బ్యాట్స్మెన్ వైఫల్యంతో భారత్ పరాజయం పాలైన సందర్భాలు కోకొల్లలు. ఈ నేపథ్యంలోసుదీర్ఘ పర్యటనకు సిద్ధమవుతున్న కోహ్లీసేన.. బ్యాట్తో రాణిస్తేనే సిరీస్ చేజిక్కే అవకాశాలున్నాయి.
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : ప్రతిష్ఠాత్మక టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ అనంతరం భారత జట్టు ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. 2014 ఇంగ్లండ్ టూర్లో ఘోరంగా విఫలమైన భారత ‘మూల విరాట్’ కోహ్లీ 2018లో స్థాయికి తగ్గట్లు రాణించినా టీమ్ఇండియా సిరీస్ నెగ్గలేకపోయింది. బౌలింగ్కు అనుకూలించే పిచ్లపై భారత పేసర్లు సత్తాచాటినా.. బ్యాట్స్మెన్ చేతులెత్తేయడంతో ఓటమి వైపు నిలువాల్సి వచ్చింది. గత మూడేండ్లలో జట్టు పరంగా ఎంతో మెరుగైన టీమ్ఇండియా.. ఈసారి ఇంగ్లండ్లో దుమ్మురేపేందుకు సిద్ధమవుతున్నది. సిరీస్ ఆరంభానికి ముందే ఇంగ్లిష్ గడ్డపై న్యూజిలాండ్తో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్న కోహ్లీసేన.. ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్తో కూడిన పేస్ దళానికి టాపార్డర్ బలం తోడైతే ఇంగ్లండ్లో టీమ్ఇండియా టెస్టు సిరీస్ నెగ్గడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
రోహిత్ ఏం చేస్తాడో..!
పరిమిత ఓవర్ల క్రికెట్లో అదిరిపోయే రికార్డు ఉన్న హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో టెస్టుల్లోనూ దుమ్మురేపుతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలోనూ అతడు ఓపెనింగ్ చేయడం ఖాయం కాగా.. ఇంగ్లండ్ స్వింగ్ బౌలింగ్ను రోహిత్తో పాటు గిల్ ఎలా ఎదుర్కుంటారో చూడాలి. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు పుజారా సిద్ధంగా ఉండగా.. సెకండ్డౌన్లో విరాట్ కోహ్లీ, ఐదో స్థానంలో అజింక్యా రహానే బ్యాటింగ్ చేయనున్నారు. వికెట్ కీపర్ బ్యాట్స్మన్గా పంత్ జట్టులో ఉండటం ఖాయం కాగా.. ఆల్రౌండర్ హార్దిక్ జట్టులో లేకపోవడంతో అశ్విన్, జడేజా ఆ తర్వాత క్రీజులోకి రానున్నారు. సమిష్టిగా రాణించి.. టీమ్ఇండియా సిరీస్ పట్టేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
టాప్పైనే భారం..
పిచ్ ఏదైనా.. వికెట్ ఎలాంటిదైనా.. బంతి ఎలా స్పందిస్తున్నా.. భారత బ్యాటింగ్ భారం మోయాల్సింది టాపార్డరే అనే విషయం తెలిసిందే. సొంతగడ్డపై టెస్టుల్లో భారీ స్కోరు చేయడం ఆనక స్పిన్తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టడం టీమ్ఇండియాకు అలవాటైన పనే. కానీ ఇంగ్లండ్ విషయానికి వచ్చేసరికి మన బౌలర్లు రాణించినా.. బ్యాట్స్మెన్ వైఫల్యంతో పరాజయాలు తప్పడం లేదు. 2014 ఇంగ్లండ్ పర్యటనలో ఘోరంగా విఫలమైన కోహ్లీ.. 2018లో 5 టెస్టుల్లో 59.30 సగటుతో 593 పరుగులు చేశాడు. ప్రపంచ మేటి బ్యాట్స్మన్గా మన్ననలు అందుకుంటున్న కోహ్లీ బ్యాట్కు పని చెబితేనే ఈ సిరీస్లో భారత్ గట్టెక్కగలదు. ఆసీస్ గడ్డపై గత రెండు పర్యటనల్లోనూ బోర్డర్-గవాస్కర్ సిరీస్లు చేజిక్కించుకున్న టీమ్ఇండియా అదే జోరులోనే ఇంగ్లండ్పైనా సిరీస్ గెలువాలని తహతహలాడుతున్నది.