భూ తగాదాలకు స్వస్తి పలికేందుకు సీఎం కేసీఆర్ కృషి
సమగ్ర భూ సర్వేకు రూ.600కోట్ల కేటాయింపు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
తొర్రూరు, ఏప్రిల్ 11 : రైతు బిడ్డగా వారి గోసను అర్థం చేసుకొని భూ వివాదాలకు స్వస్తి పలికేందుకు సీఎం కేసీఆర్ ‘ధరణి’ని తీసుకొచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. కాకినాడ ఇంజినీరింగ్ ఆలుమ్నీ ట్రస్ట్ ఫర్ సర్వీస్ (కిట్స్) ఆధ్వర్యంలో వందేమాతరం ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలోనే తొలిసారిగా భూ సర్వేపై నితిన్ భవన్లో నిరుద్యోగ యువతకు 45 రోజుల పాటు కొనసాగిన శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడుతూ.. సమగ్ర భూ సర్వే కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బడ్జెట్లో రూ.600కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. సర్వే నంబర్ ఒక చోట, భూమి మరోచోట, పొలం గట్ల తగాదాలు లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యన్నారు. కిట్స్ ప్రతినిధి, లైవ్వైర్ సంస్థ డైరెక్టర్ తటవర్తి చిన్న హనుమాన్రావును చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు స్వయంగా తీసుకెళ్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో రూ.3వేల కోట్లు కేటాయించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దశాబ్దకాలంగా వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ రవీంద్ర చేస్తున్న కృషిని ఉపసంఘానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరించానని, త్వరలోనే రవీంద్రను సీఎం దగ్గరకు తీసుకెళ్తానన్నారు.
కిట్స్ ప్రతినిధి హనుమాన్రావు మాట్లాడుతూ.. భూ రికార్డుల నవీకరణకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారన్నారు. వీఎంఎఫ్ డైరెక్టర్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ శిబిరంలో శిక్షణ పొందిన 18 మందికి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు లభించడం ఆనందంగా ఉందన్నారు. శిక్షణ పొందిన యువకులకు మంత్రి దయాకర్రావు చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. వందేమాతరం డైరెక్టర్ రవీంద్ర అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రాంచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగ సురేందర్రెడ్డి, కమిషనర్ గుండె బాబు, కిట్స్ సంస్థ ప్రతినిధులు గిరిధర్, సుబ్రహ్మణ్యం, హనుమాన్రావు, తహసీల్దార్ రాఘవరెడ్డి, గంట భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
తొర్రూరుకు చెందిన ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అలాగే మాటేడు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మృతిచెందగా ఆయన భార్య పొడగంటి మౌనికకు రూ.2లక్షల విలువైన ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. మండలంలో 46 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను గ్రామాల వారీగా అందజేస్తారని తెలిపారు.
ఇవి కూడా చదవండి