న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలోని ప్రతి క్రికెట్ అభిమాని మదిలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీయే మెదులుతున్నది. ఈ రెండు దేశాల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ గురువారం నాగ్పూర్లో ప్రారంభం కాబోతున్నది. టెస్టు ర్యాంకింగ్స్లో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఈ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్లలోని స్టార్ ఆటగాళ్లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేయబోతున్నారు.
ఈ సిరీస్ ఫలితంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఆడబోయే ఫైనలిస్టులు ఎవరో కూడా తేలిపోనుంది. ఈ సిరీస్లో భారత్ అద్భుతంగా రాణించాలంటే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పెర్ఫార్మెన్స్ కీలకం కానుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టుపై స్పిన్ దాడిని అశ్వినే లీడ్ చేయబోతున్నాడు. ఈ క్రమంలో మహిమా అనే ఒక అమ్మాయి చేసిన చిలిపి ట్వీట్కు అశ్విన్ అంతే చిలిపిగా రీట్వీట్ చేశాడు.
‘ఒకటి అబ్బాయిలకు మాత్రమే అవసరం, అది B అనే అక్షరంతో మొదలవుతుంది’ అని మహిమా అనే అమ్మాయి ట్వీట్ చేసింది. ఇక్కడ బ్యూటీనో లేదంటే ఇంకేదైనా సమాధానం రాబట్టాలనేది ఆ అమ్మాయి ఉద్దేశం. కానీ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఏమీ తెలియనట్లుగా ‘బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ’ అని రీట్వీట్ చేశాడు. అంతేగాక ఆ రీట్వీట్కు చిలిపిగా ట్రోఫీ, స్మైల్ ఎమోజీలను జతచేశాడు. అశ్విన్ హిలేరియస్ రీట్వీట్ ఇప్పుడు నెటిజన్లలో ఫన్నీ చర్చకు దారితీసింది.
Border-Gavaskar Trophy 🏆🤩 https://t.co/rzDlTW5vJJ
— Ashwin 🇮🇳 (@ashwinravi99) February 6, 2023