సూర్యాపేట, నమస్తే తెలంగాణ/సూర్యాపేట : జాతీయ 47వ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీల్లో పలు జట్ల మధ్య మంగళవారం హోరాహోరీ పోరు సాగింది. రెండోరోజు ఆరు కోర్టుల్లో 36మ్యాచ్లను నిర్వహించారు. సూర్యాపేట జిల్లాకేంద్రంతోపాటు పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి హాజరై పోటీలను వీక్షించారు. తెలంగాణ బాలికల జట్టు బీహార్ జట్టుపై విజయం సాధించడంతో మంత్రి వారి దగ్గరకు వెళ్లి అభినందించారు.క్రీడాకారులకు మంత్రి తన తల్లి గుంటకండ్ల సావిత్రమ్మ జ్ఞాపకార్థం కబడ్డీ కిట్లను అందించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్ బాలుర జట్ల మధ్య మ్యాచ్ను మంత్రి జగదీశ్రెడ్డి టాస్ వేసి ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ కె.ఇ.ప్రభాకర్, మంత్రి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్ యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ గుజ్జ యుగంధర్రావు, బెల్లంకొండ రాంచందర్గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఒకే రైడ్లో ఐదు పాయింట్లు సాధించిన కృష్ణవేణి..
బాలికల విభాగంలో తెలంగాణ, బీహార్ జట్ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఆది నుంచి నువ్వా, నేనా అన్నట్లుగా సాగిన పోరులో చివరి ఐదు నిమిషాల్లో తెలంగాణ బాలికలు సత్తాచాటారు. బీహార్ జట్టు నాలుగు పాయింట్ల అధిక్యంలో ఉండగా రైడ్కు వెళ్లిన సూర్యాపేట జిల్లా మల్లారెడ్డిగూడెం బాలిక కృష్ణవేణి ఒకే రైడ్లో ఐదు పాయింట్లు సాధించింది. మరో రెండు రైడ్లలో నాలుగు పాయింట్లు సాధించడంతో స్టేడియం మొత్తం కేరింతలు, ఈలలు మార్మోగాయి. వెంటనే మంత్రి జగదీశ్రెడ్డితో పాటు వేదికపై ఉన్న వారంతా కిందికి దిగి క్రీడాకారులను అభినందించారు. ఉత్తర్ప్రదేశ్ జట్టుతో తలపడిన తెలంగాణ బాలుర జట్టు ఓటమి పాలైంది.
మెరికల్లాంటి క్రీడాకారులను నేరుగా చూస్తున్నాం..
వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన జాతీయస్థాయి క్రీడాకారులను చూసే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. సూర్యాపేటలో కబడ్డీ పోటీలు నిర్వహించి ప్రజలందరికీ ఉచిత ప్రవేశం కల్పించిన మంత్రి జగదీశ్రెడ్డి సార్కు ధన్యవాదాలు. ఈ క్రీడలతో సూర్యాపేట కీర్తి పతాకస్థాయికి చేరుతుంది.
ఎప్పుడూ టీవీలోనే చూసేవాళ్లం..
కబడ్డీ పోటీలు ఎప్పుడూ టీవీలోనే చూసే మాకు ఇప్పుడు ప్రత్యక్షంగా చూసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం. క్రీడలు టీవీలో ప్రసారం అవుతుంటే చాలా ఆనందంగా ఉంది. స్టేడియంలో రంగు రంగుల లైట్ల వెలుతురులో పోటీలు చాలా బాగా నిర్వహిస్తున్నరు.
చాలా ఆనందంగా ఉంది..
సూర్యాపేటలో పెద్ద ఎత్తున కబడ్డీ పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద క్రీడల నిర్వహణ అంటే మామూలు విషయం కాదు. సాయంత్రం సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరికీ చూసి ఆనందించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.
చిన్నచిన్న పొరపాట్లు సహజం..
క్రీడల నిర్వహణ వెనుక మంత్రి జగదీశ్రెడ్డి చొరవ ఎంతో ఉంది. ఇంత భారీస్థాయిలో క్రీడలు నిర్వహిస్తున్నప్పుడు చిన్న, చిన్న ఘటనలు సహజమే. జాతీయస్థాయి క్రీడలు వీక్షించే అవకాశం కల్పించిన మంత్రి జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు.