టోక్యో: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్ పారాలింపిక్స్లో చరిత్ర సృష్టించింది. టోక్యో వేదికగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో సెమీఫైనల్కు దూసుకెళ్లడం ద్వారా భవీన పతకం ఖాయం చేసుకుంది. శుక్రవారం మహిళల క్లాస్-4 క్వార్టర్ ఫైనల్లో భవీనా 3-0 (11-5, 11-6, 11-7)తో డిఫెండింగ్ చాంపియన్ బొరిస్లవ పెరిక్ రంకోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించింది. 18 నిమిషాల్లో ముగిసిన పోరులో 34 ఏండ్ల భవీన.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. శనివారం జరుగనున్న సెమీస్లో జాంగ్ మియావో (చైనా)తో భవీన తలపడనుంది. గుజరాత్కు చెందిన భవీన పసిప్రాయంలోనే పోలియో బారిన పడినా.. మొక్కవోని దీక్షతో ఈ స్థాయికి చేరింది. భవీన విజయంపై భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షురాలు దీపా మాలిక్ హర్షం వ్యక్తం చేసింది. అంతకుముందు ప్రిక్వార్టర్స్లో భవీన 3-0 (12-10, 13-11, 11-6)తో జాయ్సి ఒలివెరా (బ్రెజిల్)పై నెగ్గి క్వార్టర్స్కు చేరింది. పవర్ లిఫ్టింగ్లో భారత్కు నిరాశ ఎదురైంది. మహిళల 50 కేజీల విభాగంలో సకీనా ఖాతూన్ ఐదో స్థానంలో నిలువగా.. పురుషుల 65 కేజీల విభాగంలో జైదీప్ మూడు సార్లూ నిర్ణీత బరువెత్తలేకపోయాడు. తొలి ప్రయత్నంలో 90 కేజీల బరువెత్తిన సకీనా.. మూడో ప్రయత్నంలో మరో మూడు కేజీలు పెంచినా ఫలితం లేకపోయింది. ఆర్చరీలో భారత్కు శుభారంభం దక్కింది. శుక్రవారం జరిగిన ర్యాంకింగ్ రౌండ్లో భారత ఆర్చర్ రాకేశ్ కుమార్ కెరీర్ బెస్ట్ 699 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. 682 పాయింట్లు ఖాతాలో వేసుకున్న శ్యామ్ సుందర్ స్వామి కూడా రెండో రౌండ్కు అర్హత సాధించాడు. మహిళల విభాగంలో బరిలో నిలిచిన ఏకైక భారత ఆర్చర్ జ్యోతి బలియాన్ కాంపౌండ్ విభాగంలో 15వ స్థానంతో సరిపెట్టుకుంది.