తొలిదశ లాక్డౌన్లో వలస కార్మికుల నడక కష్టాలు రోజూ చదివాం. వందల కిలోమీటర్లు తండ్రిని సైకిల్మీద తీసుకెళ్లిన బిహారీ ఆడకూతురు కథనూ చదివాం. మనసును కదిలించే ఇలాంటి ఉదంతమే, కర్ణాటకలో జరిగింది. కొడుకుకు మందులు తీసుకురావడం కోసం ఓ తండ్రి 300 కిలోమీటర్లు సైకిల్పై వెళ్లొచ్చాడు.
మైసూర్ జిల్లా నర్సాయిపూర్ తాలూకా గనిగాన కొప్పాలు గ్రామంలో ఉంటాడు ఆనంద్. కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఆనంద్కు పదేండ్ల కొడుకు. ఆరు నెలల వయసున్నప్పుడు ఆ కుర్రాడికి మానసిక సమస్య ఉందని చెప్పారు వైద్యులు. ఆనాటి నుంచి బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు ఆనంద్. బెంగళూరులోని నింహాన్స్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్) దవాఖానలో చూపించాడు. పిల్లాడిని పరీక్షించి కొన్ని మందులు రాసిచ్చారు వైద్యుడు. బాబుకు పద్దెనిమిదేండ్లు వచ్చే వరకు వాటిని రెగ్యులర్గా వాడాలని చెప్పాడు. ఆ మందులు వాడుతూ నాలుగైదు నెలలకు ఒకసారి కొడుకును దవాఖానకు తీసుకెళ్లి వైద్యులకు చూపించేవాడు ఆనంద్. పదేండ్లుగా ఇలా వైద్యం కొనసాగుతూనే ఉంది.
దవాఖానకు వెళ్లినప్పుడు ఒకేసారి రెండు మూడు నెలలకు సరిపడా మందులు తీసుకునేవాడు ఆనంద్. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం కావడం, ఉచితంగా మందులు ఇస్తుండటంతో బెంగళూరు దాకా వెళ్లి మందులు తెచ్చేవాడు. కర్ణాటకలో కరోనా విజృంభణతో కొన్ని వారాలుగా లాక్డౌన్ అమల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో కొడుకు మందులు అయిపోవడంతో ఏం చేయాలో ఆ తండ్రికి అర్థం కాలేదు. లాక్డౌన్తో పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. రెండు రోజులు మందులు వాడకున్నా కొడుకుకు ఏమవుతుందో తెలియని పరిస్థితి. తండ్రిగా తన బాధ్యత నిర్వర్తించాలనుకున్నాడు. ఓ ఉదయం సైకిల్ ఎక్కి బెంగళూరుకు పయనమయ్యాడు. దాదాపు 150 కిలోమీటర్లు అలుపెరగకుండా సాగిపోయాడు. నింహాన్స్లో మందులు తీసుకొని మర్నాడు మళ్లీ 150 కిలోమీటర్లు సైకిల్ సవారీ చేస్తూ ఊరికి చేరుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఉదంతం తెలిసిన వారంతా ‘ఆనంద్ను తండ్రిగా పొందిన అతడి కుమారుడు నిజంగా అదృష్టవంతుడు’ అంటున్నారు.